ఇక చిత్తూరు జిల్లా బంగారు బాతు...ఆర్థిక కష్టాల్లో ఆంధ్రాకు అందివచ్చిన అదృష్టం
చిత్తూరు:అసమగ్ర రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అనుకోని అదృష్టం కలసి వచ్చింది...దీంతో ప్రతికూల పరిస్థితుల్లో అనూహ్య ఊరటలా ఈ అవకాశం పరిణమించనుంది. ఇంతకీ విషయమేమిటంటే?..
గనుల శాఖ జరిపిన అన్వేషణలో చిత్తూరు జిల్లాలో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంతేకాదు దానిని తవ్వకాలు జరపడం కూడా లాభదాయకమమని గనుల శాఖ పరీక్షల్లో తేలింది. దీంతో ఈ గనుల తవ్వకాల కోసం మైనింగ్ శాఖ ఇటీవల టెండర్ల ప్రక్రియను కూడా నిర్వహించింది. అనేక కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నప్పటికీ, ఎన్ఎండిసి ఈ బిడ్లను దక్కించుకుంది. దీంతో ఈ బంగారు గనుల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.1000కోట్లు ఆదాయం లభిస్తుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే...
సాధారణంగా చాలా చోట్ల బంగారు గనులు ఉన్నా వాటిని తవ్వి తీసి బంగారంగా మలిచే ప్రక్రియకు అయ్యే వ్యయాన్ని బట్టి అవి ఆర్థికంగా లాభదాయకమా?...కాదా? అనేది తేలిపోతుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మరికొన్ని చోట్ల కూడా భూగర్భంలో బంగారు ఖనిజం ఉన్నప్పటికీ దానిని తవ్వి తీయడం ఆర్థికంగా లాభం కాదని గనుల శాఖ నిర్థారించింది. అయితే వీటికి భిన్నంగా చిత్తూరు జిల్లాలోని చిర్రాగుంట-బిశనాధంలోని బంగారు గనులు ఆర్థికంగా కూడా లాభదాయకమని గనుల శాఖ పరీక్షల్లో తేలిందని తెలిసింది.
చిర్రాగుంట-బిశనాధంలో 263.01 హెక్టార్లలో బంగారు గనులు విస్తరించి ఉన్నాయి. గనుల శాఖ చేసిన అధ్యయనంలో ఇక్కడ తవ్వకాలు జరపడం ద్వారా 947 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తేలిందట. ఇక్కడ మొత్తం 2,477 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని వెలికి తీసే అవకాశం ఉందని గనుల శాఖ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో గనుల శాఖ ఇటీవలే ఇక్కడ టెండర్ల ప్రక్రియను నిర్వహించడం జరిగింది. బంగారం లభ్యత, లాభదాయకతల గురించి గనుల శాఖ నిర్ధారణ నేపథ్యంలో వెలికితీత కోసం అనేక సంస్థలు పోటీ పడ్డాయి.
వేదాంత, ఆదాని, బల్దోతా గ్రూపునకు చెందిన ఎంఎస్పిఎల్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి కూడా ఇందుకోసం బిడ్లను దాఖలు చేసింది. మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎన్ఎండిసి అత్యధిక మొత్తానికి బిడ్ను దాఖలు చేసి ఆ బంగారు గనులను దక్కించుకుంది. ఇందులో మొత్తం విలువలో 38.25 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.
అప్ఫ్రంట్ ఫీజు 12.39కోట్ల రూపాయల్లో (మొత్తం విలువలో 0.5శాతం) తొలివిడతగా 1.23 కోట్ల రూపాయలను ఎన్ఎండిసి రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే చెల్లిస్తుందని గనుల శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ సుమారు 9.5 మెట్రిక్ టన్నుల బంగారు ఖనిజ నిలువలు ఉండగా, దానినుండి 1.83 మిలియన్ టన్నుల బంగారాన్ని తీయడం సాధ్యమవుతుందని, సగటున 5.15 పిపిఎం (పార్ట్స్ పర్ మిలియన్) బంగారం లభిస్తుందని ఆ వర్గాలు వివరించాయి.
ఈ తవ్వకాల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని...ఆ తరువాత పది నుండి 15 సంవత్సరాల పాటు ఇక్కడ గని తవ్వకాల కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఆ కాలానికి రాయల్టీగా మొత్తం విలువలో 4 శాతాన్ని చెల్లిస్తారు. ఏదేమైనా ఈ బంగారు గనుల గుర్తింపు రాష్ట్రానికి అనుకోని వరంలా భాసిల్లాయని గనుల శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు.