ఏపీలో మద్యం వ్యాపారుల ఎంత "మందు"చూపో..! ముందస్తుగా దించుకో.. అందినంతా దోచుకో..!!
అమరావతి : ఏపీలో మద్యం వ్యాపారులు ఎంతో 'మందు' చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో మద్యం వ్యాపారులు 'ముందస్తు' జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీగా సరుకు దిగుమతి చేసుకుని, ముందే అమ్మేసినట్టు చూపించి, బెల్టు షాపుల్లో నిల్వ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నిబంధనలకు దొరక్కుండా, ఎన్నికలను సాధ్యమైనంత మేరకు 'సొమ్ము' చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మద్యం అమ్మకాలతోపాటు సరుకు దిగుమతులపైనా షరతులు అమల్లోకి వస్తాయి. దీంతో ముందుగానే నిల్వలు పెంచుకుంటే ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో భారీగా మద్యం కొనుగోలు చేసుకుంటున్నారు మద్యం వ్యాపారస్తులు.
గతేడాది టార్గెట్ దాటకుండానే అమ్మకాలు..! మద్యాన్ని బెల్టులకు తరలించే వ్యూహం..!!
దీంతో మద్యం అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. జనవరి వరకు లిక్కర్లో 7 శాతం, బీర్లో 23 శాతం వృద్ధి నమోదుకాగా, ఫిబ్రవరిలో షాపులకు దిగుమతులు 39 శాతం పెరిగాయి. లిక్కర్ 23శాతం, బీర్ 58శాతం చేసుకున్నారు. మొత్తంగా మద్యం అమ్మకాల వృద్ధి 18.3శాతానికి చేరింది. ఫిబ్రవరిలో 33.4 లక్షల కేసుల లిక్కర్, 27లక్షల కేసుల బీర్ను వ్యాపారులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.1860కోట్లు. సాధారణంగా వ్యాపారులు నెలకు 1600కోట్ల విలువైన మద్యాన్ని తీసుకుంటారు. కానీ ఫిబ్రవరిలో 28 రోజులకే అంతపెద్దఎత్తున మద్యం దిగుమతి చేసుకోవడంపై ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతటా పరిమితులే..! నోటిఫికేషన్ రాకముందే జాగ్రత్త పడుతున్న వ్యాపారులు..!!
నోటిఫికేషన్ వస్తే మద్యంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఉత్పత్తి నుంచి షాపుల్లో అమ్మకాల వరకూ షరతులు ఉంటాయి. ఉత్పత్తి సంస్థ గతేడాది ఆ తేదీన ఎంత ఉత్పత్తి చేసిందో ఇప్పుడు కూడా అంతే చేయాలి. మద్యం షాపు గతేడాది ఎంత అమ్మితే ఇప్పుడూ అంతే అమ్మాలి. రోజువారీ ప్రాతిపదికన ఈ షరతులు విధిస్తారు. అంతకుమించి ఉత్పత్తి చేసినా, షాపుల్లో అమ్మినా చర్యలు తీసుకుంటారు. దీంతో దిగుమతి చేసుకున్న మద్యాన్ని వెంటనే విక్రయించాలని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు.
ఓ పక్క ఎన్నికలు..! మరో పక్క ఎండాకాలం..! జోరుగా మద్యం వ్యాపారం..!!
నోటిఫికేషన్ వచ్చాక అమ్మకాలపైనా పరిమితులు ఉంటాయి కాబట్టి కొనుగోలు చేసిన మద్యాన్ని వీలైనంత వరకు విక్రయించాలని చూస్తున్నారు. దిగుమతి చేసుకున్న మద్యాన్ని ఇప్పుడే అమ్మేసినట్టు చూపి.. బయట నిల్వ చేయాలని కొందరు ఆలోచన చేస్తున్నారు. మద్యాన్ని బెల్టు షాపులకు తరలించి, అక్కడి నుంచి వ్యాపారం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఎన్నికలు.. వేసవి కలిసి రావడంతో బీర్లకు డిమాండ్ అధికంగానే ఉంటుంది. దీంతో చీప్ లిక్కర్, బీర్ల దిగుమతులు పెరిగాయి.
అడ్డుకునేందుకు అధికారుల ఏర్పాట్లు..! ముందస్తు జాగ్రత్త పడుతున్న వ్యాపారులు..!!
ఎన్నికల్లో అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. నిరంతర పర్యవేక్షణ కోసం కమిషనరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తోంది. నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్పైనా ఎక్కువగా దృష్టి పెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గోవా నుంచి పెద్దఎత్తున ఎన్డీపీఎల్ వచ్చింది. అది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందుకోసం సరిహద్దుల్లో చెక్పోస్టులను బలోపేతం చేస్తున్నారు. తాత్కాలిక చెక్పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.