బజ్జీలు, వడలు అమ్ముతున్న కొడాలి నాని
మాజీ మంత్రి, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బజ్జీలు, బోండాలు, పునుగులు అమ్మారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా గుడివాడ పట్టణంలోని 4వ వార్డులో కొడాలి నాని పర్యటించారు. ఈ సందర్భంగా ఓ హోటల్ వద్ద ఆగిన కొడాలి తానే స్వయంగా బజ్జీలు, వడలు, పునుగులు అమ్మారు. అలాగే బజ్జీలు ఎలా ఉన్నాయో రుచిచూశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కొడాలి నాని తెలిపారు.
ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును కూడా దీన్ని బట్టి మదింపు చేయనున్నట్లు వైఎస్ జగన్ చెబుతున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం కావాలని, అలా అవనివారి జాబితా తన దగ్గర ఉందని, మారడానికి ఆరునెలల సమయం ఇస్తున్నానని, తర్వాత తనను విమర్శించినా ఉపయోగడం ఉండదని, టికెట్ ఇవ్వనని జగన్ తేల్చేస్తున్నారు.
మొదట్లో లైట్ తీసుకున్న ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు సీరియస్ గా పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న రుషిరాజ్ టీం ఇచ్చిన సూచనల మేరకే జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గడప గడపకు తిరగడంవల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించడానికి వీలవుతుందని జగన్ భావిస్తున్నారు. దీనివల్ల ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకత కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని గమనంలో ఉంచుకొని ప్రజాప్రతినిధులందరిచేతా నియోజకవర్గ పర్యటనలు చేయిస్తున్నారు.