ముందే గ్యాస్ లీక్: ఏం జరిగిందో తెలిసేలోగానే..
శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో గ్యాస్ వ్యాపించిందనే విషయం తెలియక ఓ హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. దాంతో అక్కడ ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆ పక్క నుంచి బైకులపై వెళ్తున్న తండ్రీకూతుళ్లు కూడా సజీవ దహనమయ్యారు.
ఇళ్లలో పడుకున్నవారు పడుకున్నట్లే మృత్యుఒడిలోకి జారిపోయారు. ఈ ప్రాంతంలో పది అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. అర కిలోమీటరు పరిధిలో అంతా బూడిద అయిపోయింది. గుర్తు పట్టడానికి వీలు లేనంతగా మృతదేహాలు కాలిపోయాయి.
నగరం గ్రామమంతా కాలి బూడిదైంది. పక్షులకు ఎగిరిపోవడానికి కూడా సమయం చిక్కలేదు. పశువులు, పక్షులు కూడా కాలి బూడిదయ్యాయి. 18 అంగుళాల పైపు లైన్ పగిలిపోయినట్లు చెబుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు దుయ్యబడుతున్నారు.