కాలి నడకన తిరుమలకు కుటుంబంతో గాలి
తిరుపతి: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసు నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శనివారం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన గాలి కాలినడకన కొండమీదకు వచ్చారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డికి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా శనివారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ హీరో కళ్యాణ్ రామ్ కూడా తిరుమలకు వచ్చారు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూ. ఎన్టీఆర్తో కలిసి సినిమా చేస్తామని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.
శనివారం పటాస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన కళ్యాణ్ రామ్ విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి కథ దొరికితే బాలయ్య, జూ. ఎన్టీఆర్లతో కలిసి నిటిస్తానన్నారు. పటాస్ తరువాత ‘షేర్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వివిధ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇటీవల ఓ కేసులో ఆయన హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.