చూస్తూ ఊరుకోవాలా?: గాలి, జగన్ ఫ్లెక్సీల తొలగింపు, ‘దుకాణం బంద్’
హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఆపరేషన్ ఆకర్ష్ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిందేనని అన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ తీసుకుంటే జగన్ తప్పుబట్టలేదని, ఇప్పుడు ఇదేలా తప్పనిపిస్తోందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ ప్రయత్నం చేశారని, ఆయన అలా చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.
ఓ వైపు పార్టీ ఎమ్మెల్యేలు పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. జగన్పై నమ్మకం లేకే టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారని గాలి తెలిపారు.
త్వరలో జగన్ పార్టీ దుకాణం బంద్
త్వరలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతోందని తెలుగుదేశం నేత ఆనం వివేకానందరెడ్డి జోష్యం చెప్పారు. ఎమ్మెల్యేల దగ్గర కోట్లు తీసుకుని జగన్ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే అడిగే అర్హతను జగన్ కోల్పోయారని వివేకానంద రెడ్డి అన్నారు.
జగన్ ఫ్లెక్సీల తొలగింపు
కడప జిల్లాలోని జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గతంలో ఏర్పాటు చేసిన వైయస్ జగన్, దివంగత సీఎం వైయస్సార్ ఫ్లెక్సీలను తొలగించారు.
కాగా, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరిన నేపథ్యంలో జమ్మలమడుగులోని ముద్దనూరు రోడ్డులో వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ సుధీర్రెడ్డి ఆ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.