'దోచుకోవడమే తెలుసు': 'జగన్ ఇల్లే కాదు, కూర్చున్న సీటు ప్రజలదే'
అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈడీ రూ. 749 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్పై మాటల దాడిని పెంచారు. గురువారం టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మీడియా మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్కు దోచుకోవడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి వైసీపీ అడ్డుపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ వాళ్లు భవనాలను నిర్మిస్తారే తప్ప వాళ్లేం ఎత్తుకుపోలేరని ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలన ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్కు దోచుకోవడమనే తెలుసని, ఈడీ ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శమని అన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని ఆయన తేల్చి చెప్పారు. అమరావతిలో సౌకర్యాలు కల్పించి హైకోర్టును విభజిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.
తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని న్యాయవాదులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని, అలా చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
ప్రజల కడుపుకొట్టి, ప్రభుత్వం కళ్లు గప్పి జగన్ ఆస్తులు సంపాదించాడు
ప్రజల కడుపుకొట్టి, ప్రభుత్వం కళ్లు గప్పి జగన్ ఆస్తులు సంపాదించాడని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. జగన్ ఇల్లు, కారే కాదు, ఆయన కూర్చున్న సీటు కూడా ప్రజలదేనని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈడీ చరిత్రలో అత్యధికంగా అటాచ్ చేసిన ఆస్తులు జగన్వేనని ఆయన పేర్కొన్నారు.
సీబీఐ, ఈడీ దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తుల విలువ మార్కెట్లో 5వేల కోట్లు అని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రత్యేక కోర్టుల చట్టం ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని బొండా ఉమా పేర్కొన్నారు.