విభజనపై ఉత్తరకుమారుడి ప్రగల్భాలు: సిఎంపై గాలి
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తడి గుడ్డతో గొంతుకోసే రకమని గాలి ముద్దుకృష్ణమ ఆరోపించారు. అనేక పాపాలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదని ఆయన అన్నారు. అప్పులు, ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యల విషయంలో ఎలాంటి సమాచారం లేకుండానే బిల్లుపై చర్చించమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

అసెంబ్లీలో మొదట ప్రజాసమస్యలపై చర్చిద్దామని ఆయన శాసనసభ్యులకు సూచించారు. సంప్రదాయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయకుండా వచ్చిన విభజన బిల్లును తిరిగి పంపించేయాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల కోసం తాము బిఏసి సమావేశాన్ని వాకౌట్ చేశామని గాలి ముద్దుకృష్ణమ తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతంలో రెండుగా చీలిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం అక్కడి నాయకులు పోరాడుతున్నారని చెప్పారు.
బిల్లుపై చర్చించకుండానే తిరిగి రాష్ట్రపతికి పంపించాలని ముద్దుకృష్ణమ డిమాండ్ చేశారు. సర్కారియా, పూంఛ్ కమిషన్ల సిఫారసులను పట్టించుకోలేదు కాబట్టి బిల్లును వెనక్కి పంపించొచ్చని ఆయన అన్నారు. బిఏసిలో తెలంగాణ ప్రాంత నేతలు తమ వాదనను వినిపిస్తుంటే... ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనివ్వబోమని గాలి ముద్దుకృష్ణమ్మ అన్నారు.












Click it and Unblock the Notifications