అపుతానని సిఎం ఇప్పుడేం చేస్తున్నారు: గాలి
హైదరాబాద్: విభజన ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉందని, దాన్ని వెంటనే తిప్పి పంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడారు. ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని చెప్పారు.
తుపానును ఆపలేను కానీ విభజన బిల్లును మాత్రం అడ్డుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని గాలి ముద్దుకృష్ణమ ప్రశ్నించారు. ముసాయిదా బిల్లుపై చర్చను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఆయన స్పష్టం చేశారు. బిఏసిలో విభజన బిల్లును తిప్పి పంపాలని కోరామని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా బిల్లుపై చర్చ జరపాలని పట్టుబట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 1956కు ముందు భద్రాచలం, మునగాల ప్రాంతాలు ఆంధ్రాప్రాంతంలోనే ఉన్నాయని చెప్పారు.

16 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబులు పరిపాలించారని, ఆ తర్వాత 8 జిల్లాల తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. నిజాం పాలనలో ఉన్న మిగితా 8 జిల్లాల్లో 5 మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో విలీనమవడంతో ఆ జిల్లాలను తెలంగాణ కోల్పోయిందని చెప్పారు. 1956 తర్వాత తెలంగాణతో సీమాంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇప్పుడు సీమాంధ్రా ప్రాంతంను వేరుచేయాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవాలిని కోరుకోవడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు విడిపోవాలనుకోవడం సరికాదన్నారు. విభజన తర్వాత ఉమ్మడి గవర్నర్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్కు కీలక అధికారాలు కట్టబెట్టడం సరికాదని గాలి ముద్దుకృష్ణమ అన్నారు.












Click it and Unblock the Notifications