కెసిఆర్ తెలంగాణ వీరుడు, ఎందుకో బాబును పిలువలేదు: గాలి
తిరుపతి: ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును ప్రశసించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో ప్రారంభం, తెలుగు మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన వీరునిగా కేసీఆర్ను గౌరవిస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషిచేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మెట్రో ప్రారంభానికి, తెలుగు మహాసభలకు చంద్రబాబును పిలవాల్సింది కానీ తెరాస ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదని అన్నారు. తెలంగాణలో నిజమైన స్వాతంత్రాన్ని తెచ్చిన ఎన్టీఆర్నూ గుర్తుంచుకోవాలని గాలి సూచించారు.
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమన్న వాస్తవమని అంగీకరించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ను ముద్దుకృష్ణమ నాయుడు అభినందించారు.