త్వరలో కొత్త సినిమా ‘జగన్-పవన్’, ప్రశాంత్ డైరెక్షన్, మోడీ-షా ప్రొడక్షన్: గల్లా సెటైర్లు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జయదేవ్ ఫేస్బుక్ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో జగన్-పవన్
‘త్వరలో విడుదల కానున్న కొత్త చిత్రం.. ‘జగన్ పవన్'.. రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ .. మోడీ - షా ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం మీ ముందుకు రానుంది' అని గల్లా జయదేవ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

ఏపీకి అప్పులిచ్చారు..
ఇది ఇలావుంటే, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన ‘సైకిల్ యాత్ర'లో పాల్గొన్న గల్లా జయదేవ్.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం .. ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఇచ్చారని, ఉద్యోగులు, నీటి పంపకాల విషయంలో స్పష్టత లేదని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

జగన్, పవన్ను రెచ్చగొడుతోంది బీజేపీనే
కాగా, జగన్, పవన్ను బీజేపీనే రెచ్చగొడుతోందని మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. అలిపిరి ఘటన పునరావృతం అవుతుందని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్లా బీజేపీకి ఓట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం సీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా?
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గందరగోళ వాతావరణం, శాంతిభద్రతల సమస్య సృష్టించి టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోందన్నారు. అలిపిరి ఘటన పునరావృతం అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వాఖ్యల మర్మమేమిటి? బీజేపీని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారా? వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎందాకైనా వెళ్తారని.. మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ఇండియా అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications