కొడితే పడాలి, మంత్రి పేరు: రోడ్డెక్కిన వైద్యులు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అనుచరులమంటూ వైద్యులపై దాడికి ఒడిగట్టిన సంఘటన సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. సోమవారం ఆందోళన ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు మంగళవారంనాడు కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
తాము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుచరులమని, తాము చెప్పగానే చికిత్స చేయాలని, కొడితే పడాలని దాదాపు 30 మంది గాంధీ ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వార్డులో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు. వారిని కొట్టినంత పనిచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ గ్రామానికి చెందిన రాజలింగం కుమారుడు విజయ్(30) కూలీ పనులు చేస్తాడు. ఆదివారం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, బంధువులు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిలో క్యాజువాలిటీ వార్డులో విజయ్ను చేర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్థోపెడిక్ పీజీ వైద్యులు ప్రవీణ్ కుమార్, సరిత బాధితుడికి వైద్యం చేశారు. అనంతరం ఎక్స్రే తీయించాలని సూచించారు.
దీంతో ఆ వైద్యులు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని, తాము తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుచరులమంటూ వైద్యుల్ని బెదిరించి అసభ్య పదాలతో దూషించారు. ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ ఒక్కసారిగా 30 మంది వైద్యులపైకి దూసుకు వచ్చారు. ఆ సమయంలో వైద్యుల్ని రక్షించేందుకు కనీసం సెక్యూరిటీ గార్డులు కూడా లేకపోవడంతో వైద్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: సూపరింటెండెంట్
ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులపై దాడికి పాల్పడిన నిందితులను కఠిన చర్యలు తీసుకుంటామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ధర్నా చేస్తున్న వైద్యులకు హామీనిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్థం కాకుండా చూస్తానన్నారు. వైద్యులపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమైయ్యారని, 30 మంది వైద్యులపై దాడికి యత్నించగా, కేవలం ఇద్దరిని అరెస్టు చేసి పనైపోయినట్లు మాట్లాడడం సరి కాదని రమేష్ ఆరోపించారు.
వైద్యుల ధర్నా
గాంధీ ఆస్పత్రిలో క్యాజువాలిటీ వార్డులో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి అనుచరులమంటూ ఇద్దరు వైద్యులపై దాడికి యత్నించిన 30 మంది అనుచరులను అరెస్టు చేయాలని కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న పీజీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాదాపు వంద మంది కలిసి గాంధీ ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్
వైద్యులపై దాడికి పాల్పడిన 30 మందిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. గాంధీలో పనిచేస్తున్న వైద్యులపై అకారణంగా రోగుల బంధువులు దాడి చేస్తున్నారని, అనేక సార్లు డీఎంఈ అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకపోయిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దిపేట రమేష్ విమర్శించారు.
భద్రతపై నిర్లక్ష్యం
ఆస్పత్రిలో ఇప్పటి వరకు నాలుగైదు సార్లు వైద్యులపై దాడికి పాల్పడ్డారని, ఈ విషయంపై ఎన్నో ఉద్యమాలు చేశామని, అయినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని రమేష్ విమర్శించారు.
వైద్యుల విజ్ఞప్తి
ఆస్పత్రిలో రెండు వందల సీసీ కెమెరాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు(ఎస్పీఎఫ్) పోలీసులను సెక్యూరిటీగా ఏర్పాటు చేయాలని వైద్యులు సూపరింటెండెంట్ అశోక్ కుమార్కు విజ్ఞప్తి చేశారు.