జాతిపితకు అవమానం:రాష్ట్రంలో పలు చోట్ల మహాత్మా గాంధీ విగ్రహాల ధ్వంసం
విజయవాడ:మరి కొన్ని గంటల్లో గాంధీ జయంతి జరుపుకోబోతున్న తరుణంలో రాష్ట్రంలో పలు చోట్ల ఆ మహాత్ముని విగ్రహాలకు అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నైచ్యానికి ఒడిగట్టారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపటి వేడుకల కోసం మహాత్ముని విగ్రహాలకు రంగులు వేసి ముస్తాబు చేస్తుండగానే మరోవైపు ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రపాలెం జాతీయ రహదారిని అనుకోని ఉన్న పలు జాతీయ నాయకుల విగ్రహాలలో ప్రత్యేకించి గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేసినట్లు స్థానికులు గుర్తించారు.
అదే క్రమంలో విజయవాడ పంజా సెంటర్ వించిపేట దగ్గర ఉన్న గాంధీజీ విగ్రహం హస్తాన్ని గుర్తు తెలియని దుండగులు ఉద్దేశ్యపూర్వకంగా విరగ్గొట్టారు. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల క్రితమే ఈ విగ్రహానికి రంగులు వేసి ముస్తాబు చేసినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దుశ్చర్యకు ఎవరు పాల్పడివుంటారనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఒకేసారి ఇలా గాంధీ విగ్రహాలు ధ్వంసం కావడం...యాధృచ్చికమా లేక ఎవరైనా ప్రణాళిక ప్రకారం ఇలా చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. పైగా ఇదంతా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కూడ బలుక్కొని ఇలా వివిధ ప్రాంతాల్లో చేయడం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేనిపక్షంలో ఉన్నట్టుండి ఒకేరోజు ఎందుకు దాడులు జరుగుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇటీవలే నెల్లూరు జిల్లా నాయుడుపేట పడమటివీధిలో ఉన్న గాంధీ మందిరంలోని జాతిపిత విగ్రహం ధ్వంసం అయిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతో పట్టణంలో కలకలం రేగింది. స్థానికులతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారించి నిగ్గుతేల్చాలని, మహాత్ముడి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆ సందర్భంలో వారు డిమాండ్ చేశారు.
ఇటీవలి తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపధ్యంలో తాజాగా గాంధి విగ్రహాల ధ్వంసానికి ఏదేని సంస్థకు చెందిన వారు పూనుకొని ఉండొచ్చనేది ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. ఏదేమైనా జాతి పిత విగ్రహానికి ఈ వధంగా అవమానం చేయడాన్ని ఉపేక్షించద్దని...ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని విచారించి...సిసి ఫుటేజ్ లను పరిశీలించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.