కిరణ్, బాబు కుమ్మక్కు: గండ్ర, టీ నేతల పైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి తెలంగాణను ఆపడానికి చివరి ప్రయత్నంగా కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
బిల్లు తప్పుల తడకగా ఉంటే బిఎసి సమావేశంలో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. బిల్లు వచ్చి 44 రోజులు పూర్తయిన స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి బిల్లు వెనక్కి పంపుతూ తీర్మానం చేయాలని నోటీసు ఇవ్వడం సరైంది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి సాంకేతిక కారణాలతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్కు ఇచ్చిన నోటీసుపై వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. స్పీకర్, గవర్నర్లకు లేఖలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగ నిపుణులను ఈ విషయంలో సంప్రదిస్తామని ఆయన చెప్పారు.
నోటీసు చెల్లదు: ఎర్రబెల్లి
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి చర్యను తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తీవ్రంగా తప్పు పట్టారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత నోటీసు ఇవ్వాలని ముఖ్యమంత్రికి గుర్తొచ్చిందా అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. సభా నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇవ్వడం చెల్లదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని తెలంగాణ మంత్రులు కోరాలని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు రాజీనామాకు సిద్దపడాలని కూడా ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు అనధికార తీర్మానమే అవుతుందని రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. అధికారిక తీర్మానం పెట్టాలంటే మంత్రివర్గ ఆమోదం కావాలని ఆయన అన్నారు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చింది అనధికార తీర్మానం మాత్రమే అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బిల్లు అయితేనే 77వ నిబంధన వర్తిస్తుందని ఆయన అన్నారు. అనధికార తీర్మానానికి అధికారిక రంగు పులమాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగ ప్రక్రియకు అవరోధం కలిగించే హక్కు, అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు.
హక్కు లేదు: ఈటెల
బిల్లును తిప్పి పంపే హక్కు ముఖ్యమంత్రికి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణ బిల్లును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని ఆయన మీడియా ప్రతినిదులతో అన్నారు. బిల్లును తిప్పిం పంపాలని స్పీకర్ను కోరండ చట్ట విరుద్ధమని ఆయన అన్నారు.
బిల్లుపై 90 మంది శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత బిల్లును తిప్పి పంపాలని అనడం అనైతికమని ఆయన అన్నారు. ఈనెల 30వ తేదీలోగా బిల్లుపై చర్చ ముగించి కేంద్రానికి పంపేలా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. నోటీసు పది రోజుల ముందే ఇవ్వాల్సి ఉంటుందని, ఇప్పుడు ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు.
ముసాయిదా బిల్లు శాసనసభది కాదని, రాష్ట్రపతిదని ఆయన అన్నారు. తీర్మానం చేసి బిల్లును వెనక్కి పంపుదామని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు ముద్దుకృష్ణమ నాయుడు బిఎసి సమావేశంలో అంటే అలా చేయకూడదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు.
చర్చ ఎందుకు చేపట్టారు: జూలకంటి
విభజన ముసాయిదా బిల్లు తప్పుల తడక అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ బిల్లుపై చర్చను ఎందుకు చేపట్టారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తప్పులున్నప్పుడు సభ్యులు చర్చించాల్సి ఉందంటూ కిరణ్ కుమార్ రెడ్డి గడువు ఎందుకు కోరారని ఆయన అడిగారు. ముఖ్యమంత్రిగా కొనసాగడం దురదృష్ణమంటున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయకుండా ఎందుకు కొనసాగుతున్నారని ఆయన అడిగారు. బిల్లుపై న్యాయనిపుణులను సంప్రదించాలని ఆయన స్పీకర్ను కోరారు.