మేయర్ అనురాధపై కత్తితో దాడి చేయలేదు: పదిగంటలు భర్త నరకం, వెంటాడి నరికారు
చిత్తూరు: దుండగుల దాడిలో మృతి చెందిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ భౌతిక కాయానికి బుధవారం నాడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం నివేదికలో అనురాధ మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి.
అనురాధ ఎడమ వైపు నుదుటి భాగంలో బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ దూసుకెళ్లిన కారణంగా ఆమె తలలోని మెదడు చిట్లిపోయింది. దీంతోనే ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దుండగులు అనురాధపై కత్తితో దాడి చేయలేదని కూడా పోస్టుమార్టం నివేదిక చెప్పింది.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
అనురాధ శరీరంపై కత్తి గాట్లు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వైద్యులు ఆ నివేదికలో తెలిపారని తెలుస్తోంది. కాగా, మంగళవారం నాడు తన భర్త కటారి మోహన్తో కలిసి మేయర్ కటారి అనురాధ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నసమయంలో దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో అనురాధ అక్కడికి అక్కడే మృతి చెందారు. భర్త మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. నిందితులు అనురాధను కాల్చి, భర్త మోహన్ను వెంటాడి నరికారు.
వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోహన్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. అరకంబాడి ప్రభుత్వాసుపత్రిలో మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. మోహన్ దాదాపు పదిగంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు చెప్పారు.
సుమారు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేశామని, ఆయన శరీరం నుంచి ఒక బుల్లెట్ కూడా బయటకు తీశామన్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించామన్నారు. మేయర్ అనురాధను అత్యంత పాశవికంగా హత్య చేయడం పట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
హత్యకు నిరసనగా రాస్తారోకో చేపట్టాయి. జిల్లాలోని పూతలపట్టు-నాయుడిపేట జాతీయ రహదారిపై పి కొత్తకోట వద్ద టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఈ క్రమంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, ప్రయాణికులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇదిలా ఉండగా, మేయర్ అనురాధ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, టిడిపి యువనేత నారా లోకేష్ తదితరులు చిత్తూరుకు తరలి వస్తున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చిత్తూరు చేరుకుంటారు.