ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ తిరస్కరణ: పాస్పోర్టు రద్దు
కడప: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి తరలించడం సులభతరమైది. ఆయన మారిషస్ దేశంలో బెయిల్ కోసం సోమవారం రెండోసారి ప్రయత్నించాడు. అయితే, దాన్ని తిరస్కరిస్తూ కోర్టు ఉతర్వులు జారీచేసింది. బెయిల్ కోసం మూడోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలో ఆయనకు ఇచ్చింది తప్పుడు పాస్పోర్టు అని ధ్రువీకరిస్తూ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం దాన్ని వెంటనే రద్దుచేసింది. పాస్పోర్టు రద్దు చేయడంతో గంగిరెడ్డిని తీసుకురావడానికి మార్గం సుగమమైంది. దాంతో ప్రత్యే క పోలీసు బృందాలు మారిషస్కు బయలు దేరాయి.
గంగిరెడ్డిని మన దేశానికి పంపడానికి మారిషస్ దేశం అన్ని రకాల అనుమతులు జారీ చేయడంతో అతణ్ని తీసుకురావడానికి సీఐడీ ఎస్పీతో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా పంపారు. దీంతో చట్టబద్ధంగా అతనిపై అన్ని చర్యలు తీసుకుంటూ మన దేశానికి తీసుకురానున్నారు. తీసుకొచ్చిన వెంటనే గంగిరెడ్డిపై వున్న కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుగనుంది.
ఎర్రచందనం స్మగ్లరు కొల్లం గంగిరెడ్డి ఆస్తులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ జేవీరాముడుకు టాస్క్ఫోర్స్ డీఐజీ ఎం.కాంతారావు పంపిస్తున్నట్లు తెలిసింది. అక్ర మాస్తుల్లో గనులు, పెట్రోల్బంకు, ఎకరాలకొద్దీ భూమి, కడప, చిత్తూరు జిల్లాల్లో ఖరీదైన భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. నేరచరిత్ర 1980 నుంచే ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించింది. రాజంపేట పోలీసు సబ్డివిజన్ పరిధిలో గతంలో నమోదైన హత్యాయత్నం, హత్యకేసుల వివరాలనూ డీజీపీకి పంపిన నివేదికలో చెప్పారు.
కడప జిల్లా పుల్లంపేటలో పెట్రోల్ బంకు, మంగంపేటలో బైరటీస్ గనులు, తిరుపతి, కడప జిల్లాలో బీనామీల పేరుతో దాదాపు 50 ఎకరాలకు పైగా భూములు, తిరుపతి నగరంలో హథీరాంజీ మఠం స్థలం ఎకరా ఆక్రమించి భవనం కట్టారని, పక్కనే తనకు స్మగ్లింగ్లో సహకరించిన అటవీశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులకు కొందరికి భవనాలు కట్టించినట్లు గుర్తించారు. గంగిరెడ్డి 1987లో తన అన్న ఎంపీపీ అయ్యాక తిరిగి పుల్లంపేటకు వచ్చి దందాలు, ప్రత్యర్థులపై దాడులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.