స్కూల్ పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఆందోళనకరం: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కారణంగా నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పిల్లలు గంజాయి మత్తులో తూగుతున్నారన్న వార్తకు సంబంధించి ఒక పేపర్ క్లిప్పింగ్ ను షేర్ చేసిన చంద్రబాబు బెజవాడలో12, 13 ఏళ్ళ బాలికలు గంజాయికి అలవాటు పడ్డారు అన్న విషయాన్ని చూసి షాకయ్యాను అన్నారు.

స్కూలు పిల్లలుగంజాయి తాగటం నివ్వెరపరిచింది: చంద్రబాబు
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన చంద్రబాబు 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచిందని పేర్కొన్నారు. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు వెల్లడించారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలని చంద్రబాబు తెలిపారు.

యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యటం క్షమించరాని నేరం : చంద్రబాబు
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూలంగా గంజాయిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం... యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం అని చంద్రబాబు మండిపడ్డారు. అంతే కాదు కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీలోగంజాయి దందాను టార్గెట్ చేస్తున్న టీడీపీ.. కేక్ కట్ చేసి మరీ నిరసన
ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందని, డ్రగ్స్ కింగ్ పిన్ ఎవరో అందరికీ తెలుసని జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తాజాగా గంజాయి అక్రమ రవాణా లో ఏ పీ నెంబర్ వన్ స్థానం లోకి రావడం పై తెలుగుదేశం పార్టీ వినూత్నంగా తమ నిరసనలు తెలియజేసింది. గంజాయి ఫస్ట్ ర్యాంకర్ జగన్ కు శుభాకాంక్షలు అంటూ కేక్ కట్ చేసిన టిడిపి నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చిన్నారులు గంజాయికి అలవాటు పడ్డ తీరుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇచ్చిన నివేదికలో ఏపీకి చెందిన రెండు లక్షల కేజీల గంజాయిని దేశవ్యాప్తంగా పట్టుకున్నారని పేర్కొన్నారని, అధికారికంగా ఇన్ని లక్షల కేజీల గంజాయిని పట్టుకుంటే, అనధికారికంగా మరెంత గంజాయి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుందో అర్థం చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువతను, చిన్న పిల్లలను సైతం వదలకుండా గంజాయి దందా సాగుతున్న తీరుపై తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చిన్నపిల్లలు గంజాయికి అలవాటు పడిన అంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించి జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications