గన్నవరం వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న వంశీ,యార్లగడ్డ వర్గీయులు
కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి . అసలే రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికార పార్టీలో నేతల తీరు చిరాకుగా తయారయింది. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనడానికి తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ ఒక ఉదాహరణ.
Recommended Video


కేసరపల్లిలో ఎమ్మెల్యే వంశీ ముందే కొట్టుకున్న వైసీపీ శ్రేణులు
గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలం కేసరపల్లి లో ఈరోజు వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది . స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వర్గానికి డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాలకు మధ్య మొదటినుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక తాజాగా ఈరోజు కేసరపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన వల్లభనేని వంశీ ఎదుటే ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై వివాదం ... రాళ్ళతో దాడి
ఎక్స్-సర్వీస్ మెన్ ముప్పలనేని రవికుమార్ గన్నవరం వ్యవసాయ సలహామండలి కమిటీ అధ్యక్షుడు గోపాల్ రావు పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ప్రశ్నించడంతో వివాదం రేగింది .అది కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి ఇరువర్గాల మధ్య పరస్పరం రాళ్లతో దాడులు చేసుకునే దాకా వెళ్ళింది. ఈ దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆదినుండీ వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావుల మధ్య వివాదమే ..
గన్నవరం నియోజకవర్గంలో మొదటి నుంచి వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావు ల మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి జోక్యంతో కాస్త సద్దుమణిగింది అనిపించినా తాజా ఘటనతో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయనేది వాస్తవం. గతంలోనూ పలుమార్లు వల్లభనేని వంశీ వర్గానికి యార్లగడ్డ వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు దుట్టా వర్గం కూడా వల్లభనేని వంశీ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

జగన్ చెప్పినా మారని నేతలు .. వంశీపై వైసీపీ శ్రేణుల్లో విపరీతంగా వ్యతిరేకత
నియోజకవర్గంలో అందరూ కలిసి పని చేయాలని సీఎం జగన్ సూచించినప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు అటు పోలీసులు ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా తయారైంది. గత నాలుగు రోజుల క్రితం వైసిపి నేత ఆత్మహత్యాయత్నం చేసి వల్లభనేని వంశీపై , ఆయన అనుచరుడిపై సంచలన ఆరోపణలు చేశారు . వైసిపి నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దళితులకు కాంట్రాక్టు పనులు ఎందుకంటూ, దళితులకు రావాల్సిన టెండర్లను వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అడ్డుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ జోజి బాబు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.












Click it and Unblock the Notifications