కిరణ్, మీతో సహా అందరికీ నోటీస్లు: బొత్సపై గంటా ఫైర్
ఆయన గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజనపై అధిష్టానాన్ని ధిక్కరించే వారికి నోటీసులు జారీ చేయాల్సి వస్తే కిరణ్ నుండి బొత్స వరకు అందరికీ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా నోటీసులు జారీ చేస్తూ పోతే చివరకు సీమాంధ్ర కాంగ్రెసులో ఎవరూ మిగలరన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామన్నారు.
విభజన విషయంలో అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడే వారిపై చర్యలు తీసుకుంటామన్న బొత్స వ్యాఖ్యలను గంటా నిన్న ఖండించిన విషయం తెలిసిందే. అధిష్టానం నిర్ణయాన్ని కిరణ్, బొత్స సహా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు అందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి అధిష్టానానికి మెమోరండం కూడా ఇచ్చారన్నారు.
విభజన విషయంలో చర్యలు తీసుకోదలిస్తే పార్టీలో ఎవరూ మిగలరని, అందరూ సమైక్యవాదం వినిపిస్తున్నారని బుధవారం అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిది సమైక్యవాదమే అయినా అధిష్టానం నిర్ణయం కారణంగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. సొంత జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచి నీరు తీసుకు వెళ్లడంలో తప్పులేదన్నారు. అన్ని ప్రాంతాలకు మంచినీరు తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.