తుగ్లక్: కేసీఆర్ని ఏకేసిన గంటా, అది ఫాసిజమే: కేటీఆర్
హైదరాబాద్/విశాఖ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. కేసీఆర్ది తుగ్లక్ పాలన అని, ఆయన ఆ పదవికే మచ్చ తెస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్కు దమ్ముంటే పాతబస్తీ అక్రమ కట్టడాల పైన చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ఆంధ్రావాళ్లే లక్ష్యంగా తెలంగాణలో సర్వే చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.
ఒక్కరోజులోనే సమగ్ర సర్వే జరపాలని తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక దురాలోచన దాగి ఉందన్నారు. ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో నివాసముంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడమే వారి ఉద్దేశ్యమన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ సర్వేలో ప్రజలను పలు విధాలా ప్రశ్నిస్తారని గంటా వివరించారు. ఏ సంవత్సరంలో తెలంగాణకు వచ్చారని అడుగుతారని, ప్రజలు చెప్పే జవాబును బట్టి వారికి స్థానికత కార్డు అందిస్తారని తెలిపారు.
అయితే, తాము సర్వేను వ్యతిరేకించడంలేదని, సర్వేలో వినియోగించనున్న ఫారంలోని పలు అంశాల పట్ల అభ్యంతరం చెబుతున్నామన్నారు. అందులో ఉన్న పలు అంశాలు అసంబద్దంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అవసరం లేని విషయాలను, వ్యక్తిగత విషయాలను కూడా అడుగుతున్నారన్నారు. సామాజిక సర్వేలు చేయించడం ప్రభుత్వాలకు సాధారణమే అయినా కేసీఆర్ చేయిస్తున్న సర్వే అసలు ఉద్దేశ్యాలు వేరుగా ఉన్నాయని అర్థమవుతోందన్నారు.
ఇతరుల అధికారం కోరడం ఫాసిజమే: కేటీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాసిస్టుగా అభివర్ణించడాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పూర్తిగా సమర్థించారు. ఇతరుల అధికారం కోరుకోవడం ఫాసిజమే అవుతుందని తన ట్విటర్లో వ్యాఖ్యానించారు. ‘‘ఎవరి హక్కుల కోసం వారు పోరాడటం ప్రజాస్వామ్యం. అదే పక్కవారి హక్కులను కావాలనుకోవటం పక్కాగా ఫాసిజమే''నని స్పష్టం చేశారు. యూపీఏ తప్పిదాలను గుడ్డిగా అమలు చేస్తే ఎన్డీఏ కూడా యూపీఏ-3గా మారుతుందని ఎద్దేవా చేశారు. యూపీఏను తెలంగాణ ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.