జగన్ తీరు నచ్చక 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు, రోజాకు గంటా కౌంటర్
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ నాయకుల పైన మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. విశాఖలో వైసిపి నిర్వహించనున్న సభ, అలాగే బీచ్ ఫెస్టివెల్ వివాదం పైన స్పందించారు.
ప్రతిపక్ష నేతగా వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ విశాఖలో ప్రత్యేక హోదా కోసం బహిరంగసభ అంటూ మభ్యపెడుతున్నారన్నారు. జై ఆంధ్రప్రదేశ్ పేరిట జగన్ ఈ సభను నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలపై విషం చిమ్మడం జగన్కు కొత్త కాదన్నారు. గతంలో గర్జనల పేరిట బహిరంగ సభలను నిర్వహించిన ఆయన కొత్తపేరుతో తన బాణి కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయన తీరు నచ్చక ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిన పెట్టారని, దానిని గుర్తుంచుకోవాలన్నారు.
మరోవైపు, విశాఖ బీచ్ లవ్ ఫెస్ట్ పైన కూడా గంటా స్పందించారు. విశాఖలో బీచ్ లవ్ ఫెస్ట్ నిర్వహించేది ప్రభుత్వం కాదన్నారు. అది ప్రయివేటు సంస్థ నిర్వహిస్తోందని, ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చిందన్నారు.
ఆ కార్యక్రమంతో తమకు సంబంధం లేదన్నారు. కాగా విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివెల్ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనిపై వైసిపి ఎమ్మెల్యే రోజా సహా పలువురు విమర్శలు గుప్పించారు. దీంతో ఆ కార్యక్రమంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.