ఎందుకో చెప్పు?: తెలిసి బాబు ప్లేటు మార్చారన్న జగన్పై గంటా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం మండిపడ్డారు. జగన్ ధర్నాను తూర్పారబట్టారు. జగన్కు పలు ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ టీడీపీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసిందని, ఇంకెందుకు మీరు ధర్నా చేస్తున్నారన్నారు.
వైసీపీ నుండి ఒక్కో నేత బయటకు వస్తున్నందున, ఉనికిని కాపాడుకోవడానికే జగన్ ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తోందని, అవేవీ జగన్కు కనిపించడం లేదా? చెప్పాలని నిలదీశారు.
జగన్ను ప్రతిపక్షానికి పరిమితం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇంకా జగన్ గుణపాఠం నేర్చుకోలేదా అని మండిపడ్డారు. అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ, తమ ప్రభుత్వం పైమ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు రుణమాఫీ పైన జగన్ గురువారం నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అన్నీ తెలిసి చంద్రబాబు ప్లేటు మార్చారని ఆరోపించారు.
కాగా, వైసీపీ నేడు మహాధర్నా చేపట్టింది. ఏపీలోని ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైసీపీ ధర్నా చేస్తోంది. రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని చేపడుతోంది. జగన్ విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ధర్నా చేస్తారు.
చంద్రబాబు ప్రకటనలు భూటకం: భూమన
రుణమాఫీ పైన చంద్రబాబు ఇచ్చిన ప్రకటనలు అన్నీ బూటకమేనని భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. తమ పార్టీ ధర్నాలను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. అందుకే కుట్ర పన్ని అరెస్టు చేస్తున్నారన్నారు.