ముద్రగడ, జగన్ ఒలింపిక్స్కు వెళ్లి గెలిస్తే సంతోషం: గంటా చురకలు
విజయవాడ: తపస్సు లాంటి దీక్షలను తమాషా దీక్షలుగా మార్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంలకే దక్కుతుందని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.
దీక్షలు, బంద్ల పేరుతో కొత్త రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవడం ఏమాత్రం సరికాదన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు.. జగన్, ముద్రగడల వలె నిరుద్యోగి కాదన్నారు. ఒలింపిక్స్లో దీక్షా పోటీల విభాగం ఉంటే అర్హత సంపాదించి గెలిస్తే సంతోషిస్తామని వారికి చురకలు అంటించారు.
చంద్రబాబులో బలంగా హోదా ఆలోచన: శిద్ధా
ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న తపన సీఎం చంద్రబాబులో బలంగా ఉందని మంత్రి శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లాలో అన్నారు. హోదా కోసం తాము అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. సమయం వచ్చినప్పుడు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమన్నారు. హోదా సాధించే క్రమంలో తమ ప్రభుత్వం కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతోందన్నారు.
బీజేపీకి ఆ ధైర్యం లేదు: రఘువీరా రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం లేదని, కానీ ఆ మాటను బీజేపీ ధైర్యంగా చెప్పలేకపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఈ రోజు ఏపీ విద్రోహదినంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు కృష్ణా పుష్కరాల పేరుతో ఢిల్లీకి వచ్చి బిల్లును అడ్డుకున్నారన్నారు. నియోజకవర్గాల పెంపు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఎంపీలు కాంట్రాక్టుల కోసమే ప్రధాని మోడీ వద్దకు వెళ్లారన్నారు.