'టీ ఉన్నత విద్యామండలికి గుర్తింపు లేదు' (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలికి గుర్తింపు లేదని, ఆ సంస్ధను గుర్తించడం లేదని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం గవర్నర్ నరసింహన్ ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మట్లాడారు.
విభజన చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ సర్కారు మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఎంసెట్ తేదీలను ప్రకటించడంపై ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం ఏపీ ఉన్నత విద్యామండలి నిధులను తెలంగాణ ఉన్నత విద్యామండలికి బదిలీ చేయబోమని అంధ్రాబ్యాంకు స్పష్టం చేసిందన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి నుంచి నిధులను విభజించి ఇవ్వాలని ఈనెల 5న తెలంగాణ సర్కారు లేఖ రాయగా, ఇది కుదరదని బ్యాంకు చెప్పిందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రకటించిన తేదీల్లో ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. గవర్నర్ ఇచ్చిన మూడు ఆప్షన్లకు తాము సిద్ధంగా ఉన్నా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మళ్లీ గవర్నర్ ను కలుస్తానని చెప్పారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో అతంర్బాగమేనని, అందరూ చట్టాలను గౌరవించాలని అన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గంటా శ్రీనివాసరావు చెప్పారు.












Click it and Unblock the Notifications