జగన్ నీచుడు! మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: గంటా, యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు, నాయకులు ఆయనపై మండిపడుతూనే ఉన్నారు. తాజాగా, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆయన శనివారం మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని వెంటనే మెంటల్ ఆస్పత్రిలో చేర్చించాలని అన్నారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. అతడు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని గంటా మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం నంద్యాల సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబును కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అలాంటివాడు నాయకుడే కాదు: యరపతినేని
గుంటూరు: వైయస్ జగన్పై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను రాజకీయాల నుంచే కాకుండా సంఘ బహిష్కరణ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
జగన్ లాంటి నీచుడిని ఎన్నడూ చూడలేదని యరపతినేని విమర్శించారు. ఎదుటి నాయకుడు చనిపోతే పదవి పొందాలనుకునే వాడు నాయకుడే కాదని యరపతినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నంద్యాలలో టీడీపీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే యరపతినేని చెప్పారు.