కొడాలి నానీకి ఇబ్బందిగా మారిన చెత్తపన్ను.. పేర్ని నానీకి ఫోన్; జగన్ ను కలుస్తారట!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి గత కొంతకాలంగా కొనసాగిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ప్రజలనుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చెత్తపన్ను పైన మహిళలు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉందని సామాన్యులు ఎమ్మెల్యేల వద్ద వాపోతున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా చెత్త పన్ను, అతి పెద్ద సమస్యగా మారింది.

ఎమ్మెల్యే కొడాలి నానీకి చెత్తపన్ను తెచ్చిపెట్టిన చిక్కు
తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ సందర్భంగా మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. చెత్త పన్ను చెల్లించడం తమకు కష్టంగా ఉందని, అద్దెకు ఉంటున్న వారు కూడా చెత్త పన్నులు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని, వారు ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్లారు.

చెత్తపన్ను వసూళ్ళలో గుడివాడ టాప్ లో ఉందన్న అధికారులు .. కొడాలి నానీకి వివరణ
ఇక మహిళలు చెప్పిన సమస్య పై స్పందించిన కొడాలి నాని అక్కడ చెత్త పన్ను వసూలుపై మున్సిపల్ అధికారులను పిలిచి, చెత్త పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయిన అధికారులు చెత్త పన్ను వసూళ్లలో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని, నెలకు సుమారుగా 16 లక్షల టార్గెట్ వుంటే, 14 లక్షల రూపాయలు వసూలు అవుతోందని అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్లారు.

చెత్తపన్ను వసూలు చెయ్యొద్దు అన్న కొడాలి నానీ.. జగన్ ను కలుద్దాం అంటూ పేర్ని నానీకి ఫోన్
అధికారులు చెప్పిన సమాధానానికి కొడాలి నాని ఈ మాత్రం దానికి ప్రజలపై భారం వేయడం మంచిది కాదని, ఇకపై చెత్త పన్ను వసూలు చెయ్యొద్దు అంటూ అధికారులను ఆదేశించారు. అంతేకాదు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి, చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. ఇక ఆ పై వెంటనే పేర్ని నానికి ఫోన్ చేసి అన్నా.. చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి సీఎం ని కలుద్దాం అంటూ పేర్కొన్నారు. పేర్ని నానీతో కలిసి వెళ్లి సీఎం జగన్ తో చర్చించాలని కొడాలి నాని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. చెత్తపన్నులు వసూలు చెయ్యొద్దన్న కొడాలి నానీ
చెత్త పన్ను వసూళ్లపై ప్రజావ్యతిరేక చూడడానికి చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ అది స్థానికంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యేలు చెత్త పన్ను విషయంలో జనాల నుండి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విషయం అటుంచి, ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. చెత్తపన్నులు వసూలు చెయ్యొద్దని కొడాలి నానీ అధికారులను ఆదేశించటం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మరి ఈ వ్యవహారంలో కొడాలి నానీ నిజంగానే జగన్ ను కలుస్తారా ? చెత్తపన్ను విషయంలో నిర్ణయం మార్చుకునేలా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications