ప్రెస్ మీట్ల బాబు, లోకేష్ అజ్జాని: జగన్ పార్టీ నేతలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ అజ్ఞాని అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రాంచంద్రరావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్కు లేదని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా అని ఆయన ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ.. మీకు సొంతంగా పార్టీ పెట్టే సత్తా ఉందా అని లోకేష్ను ఉద్దేశించి గట్టు రాంచంద్రరావు అన్నారు.
ప్రెస్ మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల
రాష్ట్ర విభజనపై స్పష్టత లేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. చంద్రబాబు విభజన ప్రకియను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి దాసోహమై, రాష్ట్రంలో సమైక్యమని చెప్తూ నాటకాలాడుతున్నారని కొణతాల ఆరోపించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 3 పై చేస్తున్నపోరాటం సఫలీకృతమైందని కొణతాల రామకృష్ణ తెలిపారు. పార్లమెంటులో అన్ని జాతీయ పార్టీలు ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడని నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కొణతాల ఆరోపించారు.