కాకినాడలో దారుణం: జర్మనీ పర్యాటకుడిని ఉన్మాదిగా భావించి స్థానికుల దాడి
Recommended Video
కాకినాడ: సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న కొన్ని పోస్టులు ఇతరుల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం వదంతులను నమ్మొద్దని ఎన్ని హెచ్చరికలు చేసిన ప్రజలు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని యదేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో బలైంది సాటి భారతీయులే కాగా... ఇప్పుడు ఆ దాడులు విదేశీయులపైకి కూడా పాకాయి. ఇందుకు నిదర్శనం కాకినాడ బీచ్ను చూసేందుకు వచ్చిన ఓ విదేశీయుడిపై అక్కడి స్థానికులు దాడి చేయడమే.
కాకినాడ బీచ్ అందాలను చూసేందుకు మైఖేల్ ప్రాక్టర్ అనే జర్మనీ దేశస్తుడు వచ్చాడు. సూర్యారావుపేట సమీపంలోని బీచ్కు చేరుకున్నాడు యువకుడు. మద్యం తాగి బీచ్వైపు నడుస్తుండగా అతనిని గమనించిన స్థానికులు ఉన్మాదిగా భావించి మైఖేల్ను చితకబాదారు.విచక్షణా రహితంగా చితకబాదడంతో మైఖేల్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మైఖేల్ పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని, ఎవరు దాడి చేశారన్న విషయమై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వస్తున్న వదంతులకు ఎంతో మంది బలయ్యారు. కొత్త ముఖం కనిపిస్తే చాలు... పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా భావించి చితకబాదుతున్నారు గ్రామస్తులు. కొందరు ఆ దెబ్బలకు చనిపోతున్నారు కూడా. ఇదే అంశంపై పార్లమెంటు కూడా దద్దరిల్లింది. సామూహిక దాడులుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని అది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇవ్వడంతో విపక్షాలు మండిపడ్డాయి. రాజ్నాథ్ బాధ్యతారహితంగా ప్రకటన చేశారని విపక్షాలు ధ్వజమెత్తాయి. అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నెపం నెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విపక్షాలు దుయ్యబట్టాయి.