షాక్: సినీ హీరో వెంకటేష్కు జిహెచ్ఎంసి నోటీసులు
హైదరాబాద్: తెలుగు సినిమా హీరో వెంకటేష్కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) నోటీసులు జారీ చేసింది. అనుమతి లేకుడా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలపై జిహెచ్ఎంసి సర్కిల్ -10 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారంనాడు నోటీసులు జారీ చేశారని వార్తలు వచ్చాయి.
ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1లో హీరో వెంకటేష్కు ప్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఆ ప్లాటులో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే, తమ అనుమతి లేకుండా ఈ నిర్మాణాలు జరుగుతుండడంతో వివరణ ఇవ్వాలని జిహెచ్ఎంసి నోటీసులో తెలిపింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరించారు.
తనకు చెందిన ఆ స్థలాన్ని పి. ప్రమోద్ కుమార్ డైరెక్టర్గా ఉన్న మున్నా యునైటెడ్ హాస్పిటాలిటీ సర్వీసెస్కు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి లీజుకు ఇచ్చినట్లు హీరో డి. వెంకటేష్ బాబు చెప్పారు. జిహెచ్ఎంసి ఈ ఏడాదినవంబర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చిందని, ఆవరణ చేసిన మార్పులకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి లీజు తీసుకున్నవారికి సమయం ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ వివరణతో పాటు వెంకటేష్ కార్యాలయం నుంచి జిహెచ్ఎంసి ఇచ్చిన నోటీసును, వెంకటేష్ చెల్లించిన అస్తిపన్ను డాక్యుమెంట్లను, హైదరాబాద్ నగర పాలక సంస్థ భవనానికి ఇచ్చిన అనుమతి పత్రాన్ని కూడా జతచేశారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో జిహెచ్ఎంసి అధికారులు చర్యలకు ఉపక్రమించిన తర్వాత వెంకటేష్ నిర్మాణాలపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. హైటెక్ సిటీ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంతమేరకు ఆక్రమిత భూముల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
గ్రేటర్ హైదరాబాద్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిని గుర్తిస్తూ హద్దురాళ్లను పాతారు. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తమ్మిడికుంటకు చెందిన 3 ఎకరాలా 12గుంటల భూమిని కలుపుకొన్నట్టు అధికారులు గుర్తించినట్లు అపట్లో ఆరోపణలు వచ్చాయి.