పిల్లలుండగానే పాఠశాలను కూల్చేసిన జిహెచ్ఎంసి
హైదరాబాద్: పాఠశాల నడుస్తుండగానే కూల్చివేసిన ఘటన నగరంలోని యూసుఫ్గూడ వెంకటగిరి కాలనీలో చోటు చేసుకుంది. అక్రమంగా నిర్మించిన ఆ పాఠశాల భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక సాయిరామ్ హైస్కూల్ భవనంలో రెండు అంతస్థులను కూల్చివేశారు. తరగతి గదుల్లో విద్యార్థులుండగానే జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేతకు దిగడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం హుటాహుటిన విద్యార్థులను బయటకు పంపించేసింది.

ముందస్తు ఆదేశాలు లేకుండా ఒక్కసారిగా కూల్చివేయడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. అక్రమంగా నిర్మించారనే కారణంగా ఐదు అంతస్తుల పాఠశాల భవనంలోని రెండు అంతస్తులను కూల్చివేశారు.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించామని తమ చర్యను జిహెచ్ఎంసి అధికారులు సమర్థించుకున్నారు. పాఠశాల భవనాన్ని కూల్చివేయాలని గతంలో నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించలేదని జిహెచ్ఎంసి స్పష్టం చేసింది. కాగా, తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని సాయిరామ్ హైస్కూల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వాపోయారు.
ఎలాంటి హెచ్చరికలు లేకుండా జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేతకు దిగడాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబట్టింది. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై జిహెచ్ఎంసి అధికారులను వివరణ కోరినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications