నాపై దాడి అమానుషం, హక్కుల నోటీసు ఇస్తా: జగన్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి
విశాఖపట్నం: ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసిపి రమణ దాడి చేయడం అమానుషమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై ఏసిపి రమణ దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై గవర్నర్ , స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ సంఘటనపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసులు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.
విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. అధికార పార్టీకి తొత్తులుగా ఉండాలనుకుంటే.. కాకీ చొక్కాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేయాలంటూ పోలీసులకు సూచించారు. మహిళ కార్యకర్తలపై దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని అమర్నాధ్ హెచ్చరించారు.
ధర్నా అనంతరం కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కలెక్టరేట్లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నతాధికారులు లేకపోవడంతో వినతి పత్రాన్ని గోడకు అంటించారు. కాగా, గోడకు అంటించిన వినతి పత్రాన్ని ఏసిపి రమణ చించేశారు. ఏసిపి వైఖరిపై వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.