భర్త బెంగళూర్ వెళ్లాడు: కిడ్నాప్ చేసి, నిర్బంధించి రెండు నెలలు భార్యపై రేప్
కడప/ ఒంగోలు: కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బెదిరించి నెలరోజులుగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యువతిని ఇంటి యజమాని కొడుకు నగ్నంగా సెల్ఫోన్లో చిత్రీకరించి బెదిరిస్తూ వచ్చాడు.
ఆ తర్వాత యువతిని చంద్రగిరిలో నిర్బంధించి రెండు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు లేని సమయంలో తప్పించుకున్న బాధితురాలు కడప ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగలదిన్నె గ్రామానికి చెందిన ఆ యువతికి జనవరి 24వ తేదీన వివాహమైంది. భర్త కాంట్రాక్టు పని మీద రెండు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఇది గమనింిచన ఇంటి యజమానికి కొడుకు పవన్ కుమార్ (22) ఆమెను వేధించడం ప్రారంభించాడు.
ఆమెను లొంగిదీసుకునే ప్రయత్నంలో ఆమె స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించి కిడ్నాప్ చేసి చిత్తూరు జిల్లా చంద్రగిరికి తీసుకుని వెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించాడు. అక్కడ రెండు నెలల పాటు ఆణెపై లైంగిక దాడి చేసి బ్లేడుతో గాయపరిచాడు.
లైంగికదాడిని సెల్ ఫోన్లో చిత్రీకరించి ఎవరికైనా చెప్తే దాన్ని నెట్లో పెడుతానంటూ బెదిరించాడు. అతని నుంచి తప్పించుకున్న మహిళ ఎస్పీ నవీన్ గులాటీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పవన్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పుల బాధతో కడప జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కమలాపురం మండలం కోకటంలో చెట్టుకు ఉరివేసుకుని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన వారుగా గుర్తించారు.
విద్యార్థి ఆత్మహత్యపై ఆందోళన
ప్రకాశం జిల్లాలోని దర్శి గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి వినయ్ ఆత్మహత్యకు నిరసనగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. మద్దిపాడు మండలం దొడ్డవరానికి చెందిన వినయ్ గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
మంగళవారంనాడు ఆశ్రమ పాఠశాలలో కనిపించకుండా పోయాడు. దీంతో ప్రిన్సిపాల్ బాలాజి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వినయ్ పాఠశాల భవనంపై ఉన్న ఓ గదిలో ఉరివేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మృతికి ప్రిన్సిపాలే కారణమని వినయ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.