తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం: పరిస్థితి విషమం
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు ఎస్సీ బాలికల వసతి గృహంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
చిత్తూరు: ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలు తిరుపతి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, 8 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు, వడమాలపేట, పుత్తూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో 15 చోట్ల వీరు చోరీలకు పాల్పడినట్టు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.
గోదావరిలో కానిస్టేబుల్ గల్లంతు
తూర్పుగోదావరి: రాజమండ్రిలోని గోదావరి నదిలో గౌతమి ఘాట్ వద్ద ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు(29) గల్లంతయ్యాడు. శనివారం గోదావరిలో ఈత ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాసరావు స్వస్థలం పిఠాపురం.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం: ఒకరి మృతి
గుంటూరు: సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.