విశాఖలో కార్లలో తిప్పుతూ గ్యాంగ్ రేప్, ఫోన్ చేసి: నిందితుల అరెస్టు
విశాఖ: విశాఖలో యువతి పైన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని, అతనికి సహకరించిన మరో మిత్రులను పోలీసులు శనివారం నాడు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శనివారం సాయంత్రం డీసీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
విజయవాడకు చెందిన బాధిత యువతి తన స్నేహితుడు శ్రీనివాస్ సోదరి వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 4వ తేదీన విశాఖ శివారు పెందుర్తి వచ్చారు. ఆమె హైదరాబాదు నుండి వచ్చారు. నాలుగో తేదీన పెళ్లైంది. తర్వాత రోజు ఆమెకు విశాఖను చూపించేందుకు ఆమె స్నేహితుడు శ్రీనివాస్... తన స్నేహితుడు చందు ఇంటి వద్ద మిత్రురాలికి బస ఏర్పాటు చేశాడు.
చందు ఆమెను రాంనగర్లోని తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన తన ఇంటి పక్కనే ఉన్న మరో భవనంలో స్నేహితులతో కలిసి ఐదో తేదీన రాత్రి పార్టీ చేసుకున్నారు. గస్తీ తిరుగుతున్న పోలీసులు వచ్చారు. వారిని చూసి చందు, ఆయన స్నేహితులు ఎవరికి వారు పరుగు తీశారు. సమీపంలో ఉన్న ఆ యువతి ఈ హఠత్పరిణామంతో గందరగోళంలో పడింది.
ఆమె కూడా మరోచోటకు వెళ్లింది. కారులో అటువైపు వస్తున్న యేర్నేంద్ర రావు, శివ, సునీల్ల కంటపడింది. సహాయం చేస్తామని వారు ఆమెకు మాయమాటలు చెప్పారు. ఆమెను కారులో ఎక్కించుకున్నారు. రాత్రంతా యువతిని కార్లు మార్చిమార్చి తిప్పుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
యేర్నేంద్ర రావు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరో తేదీన తెల్లవారుజామున్న మూడున్నర గంటలకు విశాఖలోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు జరిగిందంతా చందూకు ఫోన్ చేసి చెప్పింది. ఆమెను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆ రోజు సాయంత్రం చందూ.. ఆ యువతితో కలిసి ప్లాన్ చేసి నిందితులను పట్టించారు. విజయవాడ వెళ్లేందుకు తనకు డబ్బులు అవసరమని ఆమెతో చందూ నిందితులకు ఫోన్ చేయించాడు. నిందితులు ముగ్గురు అక్కడకు వచ్చారు. చందూ వారిని నిలదీశాడు. వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడకు వచ్చిన నిందితులు ఇద్దరు పరారయ్యారు. మూడో నిందితుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పారిపోయిన ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. నిందితులు వాడిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులు బాధితురాలిని కారులో వేధించిన సమయంలో ఆమె ఫోన్ నెంబరును ఫీడ్ చేసుకున్నారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి వేధించినట్లుగా తెలుస్తోంది.