లొంగదీసుకున్న యువకులు: స్కూల్లో ప్రసవించిన విద్యార్థిని, శిశువు పారవేత
హైదరాబాద్: కొంత మంది యువకుల చేతిలో మోసపోయి గర్భం దాల్చిన పదవ తరగతి విద్యార్థినికి కస్తూరిబా పాఠశాల సిబ్బంది పురుడు పోసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థిని ప్రసవించిన ఆడబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల ఆవరణలోని ఖాళీ తొట్టిలో పారవేశారు. పోలీసులు శిశువును ఆసుపత్రిలో చేర్పించగా మృతి చెందింది.
ఆ సంఘటనపై విచారణ జరిపిన జిల్లా ఉన్నతాధికారులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలిశాయి. దీంతో ఐదుగురు సిబ్బందిపై కలెక్టర్ వేటు వేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం తుంపెరగ్రామానికి చెందిన బాలిక(15) పుట్లూరు కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. కొంతమంది యువకులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో గర్భం దాల్చింది.
అయితే విషయం తల్లిదండ్రులకు చెప్తే కొడతారన్న భయంతో బాలిక ఎవరికీ చెప్పకుండా జగ్రత్తపడుతూ వచ్చింది. గత నెల 28వ తేదీ అర్ధరాత్రి విద్యార్థినికి నొప్పులు రావడంతో కెజిబివి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా కాన్పు చేశారు. ఆడశిశువు పుట్టడంతో పాఠశాల ఆవరణలోని నీళ్లు లేని తొట్టిలో వదిలేశారు. మరుసటి రోజు విషయం బయటకు పొక్కడంతో పుట్లూరు ఎస్సై ప్రదీప్కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని పసికందును తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.

ఆ తర్వాత శిశువును ఐసిడిఎస్ అధికారులకు అప్పగించగా శిశువు మృతి చెందినట్లు సమాచారం. డిఎస్పీ చిదానందారెడ్డి రంగంలోకి పాఠశాల సిబ్బంది, విద్యార్థినులను ప్రశ్నించగా బాధితురాలి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో బాలికను విచారించగా ముగ్గురు యువకుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. పురుడుపోసిన సిబ్బంది వివరాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.
డిఎస్పీ చిదానందారెడ్డి కలెక్టర్కు నివేదిక అందజేశారు. డిఎస్పీ నివేదిక ఆధారంగా కస్తురిబా విద్యాలయానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ ఎం.కళ్యాణి, వ్యాయామ ఉపాధ్యాయిరాలు బి.శివజ్యోతి, ఎఎన్ఎం సి.సుధీష్ణ, అటెండర్ ఎల్.కె.రమాదేవి, నైట్ వాచ్ఉమెన్ అంకాలమ్మను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications