పెళ్లి చేసుకుని కాపురం పెట్టి గర్భవతిని చేశాడు: ఇప్పుడు కాదంటన్నాడు
పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు, ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఇంటికెళ్లిపోయాడు. ఇప్పుడు ఆమెను చేపట్టడానికి నిరాకరిస్తున్నాడు.
కర్నూలు: తనకన్నా వయస్సులో పెద్దది, భర్తతో విడాకులు చేసుకుంది. ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడు. రహస్యంగా హైదరాబాదులో కాపురం పెట్టి, ఆమెను గర్భవతిని చేశాడు. తల్లిదండ్రులతో ఇంటికెళ్లిపోయాడు. ఆమె అక్కడికి వెళ్లి తన భర్తను పంపించాలని డిమాండ్ చేసింది. అతని తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతను మాత్రం తన తల్లిదండ్రుల మాటనే వింటానని అంటున్నాడు.
అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. ఇద్దరూ ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టిన తర్వాత అబ్బాయిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో భర్త కోసం ఆమె అత్తారింటికి వెళ్లిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తను తనవెంట పంపాలని వేడుకుంటోంది. అతను మాత్రం తల్లిదండ్రులే కావాలని అంటున్నాడు.
వివరాలు ఇలా ఉన్నాయి - కర్నూలుకు చెందిన సాయి ఈశ్వర్, గుంతకల్కు చెందిన రాజేశ్వరీ ఫేస్బుక్ ద్వారా పరిచయమై..ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయసు బేధం ఉన్నా వారి ప్రేమకు అది అడ్డురాలేదు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న రాజేశ్వరిని సాయి వివాహం చేసుకున్నాడు. రాజేశ్వరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ లలితానగర్లో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సాయి తండ్రి అతనిని కర్నూలుకు తీసుకువెళ్లారు.
భర్త కోసం రాజేశ్వరి కర్నూలుకు వెళ్లింది. సాయిని తనవెంట పంపాలని కోరింది. దానికి సాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో బ్లేడుతో చేయి కోసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం రాజేశ్వరి గర్భవతి.
కాగా, తల్లిదండ్రులకు తెలియకుండా పెద్ద తప్పు చేశానని సాయి అంటున్నాడు. తల్లిదండ్రులు ఎలా చెబితే అలా చేస్తానని అంటున్నాడు. అన్ని విషయాలు తెలిసే సాయి తనను పెళ్లి చేసుకున్నాడని రాజేశ్వరి అంటోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కాగా సాయి వయసు 21 ఏళ్ల లోపే ఉంటుందని, అతడి వివాహం చెల్లదని తల్లిదండ్రులు వాదిస్తున్నారు.