కారులో తిప్పుతూ యువతిపై పలుమార్లు నలుగురు రేప్
ఓ యువతిని నలుగురు యువకులు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో కేసులో భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు పడింది.
విజయవాడ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఏ. కొండూరు మండలం కంభంపాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. క్వారీలో పనిచేస్తున్న ఓ యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగింది. క్వారీ సూపర్వైజర్ కరీముల్లా, పెద్దిరాజు, రామకృష్ణ, శ్రీను అనే ఈ నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ కంభంపాడు పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నాలుగు రోజులకింద యువతిని కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. బలవంతంగా యువతికి హెయిర్ డై తాగించి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అనంతరం భయంతో యువతిని తెనాలి బస్టాండ్లో వదిలివెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, యువతిని వేధింపులకు గురి చేస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డి.వెంకటరమణ తెలిపారు. అయితే బాధితురాలి ఫిర్యాదు అలా ఉంటే మరో కథనం కూడా వినిపిస్తోంది. ఎ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన యువతి గత కొద్ది రోజులుగా కంభంపాడు సమీపంలో ఉన్న పలుకు రాయి క్వారీలోకి పనులకు వెళ్తొంది.

అక్కడే పనిచేస్తున్న నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కరీముల్లా గత కొద్ది రోజులుగా తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గోపాలపురానికి చెందిన తిరుపతి పెద్దిరాజు, ఇర్ల శ్రీను, చెల్లా రామకృష్ణలు సైతం కరీముల్లా ప్రేమను అంగీకరించాలని ఆమెను ఒత్తిడికి గురి చేస్తూ వచ్చారు. ఈ నెల 14న పెద్దిరాజు, శ్రీను, రామకృష్ణలు యువతికి కూలి డబ్బులు ఇస్తామని నమ్మబలికి చీమలపాడు వరకు ఆటోలో తీసుకెళ్లి వూరు చివర బస్సు ఆపి ఆమెను బలవంతంగా బస్సు ఎక్కించారు.
అప్పటికే బస్సులో ఉన్న కరీముల్లా యువతిని విజయవాడ తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తరువాత కరీముల్లా ఆమెపై అత్యాచారం చేసి హత్యచేయడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకొచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.కన్నప్పరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు
అనుమానంతో భర్తను దారుణంగా హత్య చేసిన భార్యకు జీవిత ఖైదుతోపాటు రూ. 500 జరిమానా విధిస్తూ విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయస్థా´నం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితురాలు అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు.
అరకు పోలీసుస్టేషన్ పరిధిలోని దుంబ్రిగూడకు చెందిన తోబోయి వీరమ్మ, లచ్చన్న భార్యాభర్తలు. లచ్చన్న తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరమ్మ కూలి పనులు చేస్తూ వస్తోంది. భర్త ప్రవర్తనపై వీరమ్మకు అనుమానం ఉండటంతో నిత్యం వారి మధ్య ఘర్షణ జరిగేది. 2015 ఫిబ్రవరి 1న భార్యాభర్తలిద్దరూ చాపరాయి వద్ద జరుగుతున్న థింసా నృత్యానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంటికి వెళ్లిన తర్వాత అదేరోజు సాయంత్రం భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో వీరమ్మ దగ్గరలో ఉన్న గొడ్డలిని తీసుకుని లచ్చన్నపై దాడి చేసి నరికింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు కేసును నమోదు చేసి, నిందితురాలిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి జీవిత ఖైదు విధించారు.












Click it and Unblock the Notifications