హస్టల్లో విద్యార్థినికి అబార్షన్, ఏం జరిగింది?
ప్రభుత్వ హస్టల్లో గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ చేయించిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
విజయనగరం: ప్రభుత్వ హస్టల్లో గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ చేయించిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం గోడ వెనుక నిర్జీవంగా పడి ఉన్న పసికందు శవం కలకలం రేపింది. హస్టల్ విద్యార్థిని గర్బం దాల్చడంతో వసతిగృహ సిబ్బంది, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన ఘటన సంచలనం కల్గించింది.
హస్టల్ నుండి పసిబిడ్డను బయటకు విసిరేసే సమయంలో అటుగా వెళ్ళిన వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. హస్టల్ సంక్షేమాధికారి విజయనిర్మలను సస్పెండ్ చేశారు.సాంఘిక సంక్షేమశాఖ జిల్లా సహయాధికారి శశిభూషణ్ను సస్పెండ్ చేయాలని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఆయన సిఫారసు చేశారు. హస్టల్ వాచ్ఉమెన్ను విధుల నుండి తొలగించారు.