దారుణం: ఒంటిపై కిరోసిన్ పోసుకుని విద్యార్ధిని ఆత్మహత్య
అమరావతి: ఆకతాయి వేధింపులకు ఓ విద్యార్ధిని మంటల్లో కాలిపోయింది. తూర్పుగోదవారి జిల్లాలోని రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతంలోని ఎస్కేవీటీ కళాశాల విద్యార్థిని గొర్ల అనూష జ్యోతి ఓ విద్యార్థి వేధింపులు భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు, విద్యార్ధులు అందించిన సమాచారం ప్రకారం జిల్లాలోని రంగంపేట మండలం రామవరంచండ్రేడు గ్రామానికి చెందిన అనూష జ్యోతి ఎస్కేవీటీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో డే స్కాలర్గా చేరడంతో ప్రతిరోజూ ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వెళుతోంది.
ఈ క్రమంలో గత రెండు నెలలుగా అదే కళాశాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్ధి మణికంఠ ఆమెను వేధిస్తున్నాడు. కాలేజీలో మాటలతో వేధింపులకు గురి చేయడమే కాకుండా, ఫోన్కు ఎస్ఎంఎస్లు పంపి విద్యార్ధిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాడు.
అతని ఎస్ఎంఎస్లకు స్పందించకపోయినా, కాలేజీకి రాకపోయినా తన ఇంటికే వస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన అనూష సోమవారం కళాశాలకు వెళ్లలేదు. దీంతో తాను సవాల్ విసిరినట్లుగానే మణికంఠ రామవరం చండ్రేడు గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో అనూష ఒక్కతే ఉందని తెలుసుకుని ఆమెపై అఘాయిత్యానికి కూడా పాల్పడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దీంతో భయపడిన అనూష వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కూలి పనులు ముగించుకుని రాత్రి 7 గంటలకు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగా అనూష ఇంట్లో ఓ మూలన కాలిపోయి కనిపించేసరికి కోలుకోలేకపోయారు. దుఃఖాన్ని దిగమింగుకుని చిన్న కూతురు అంత్యక్రియలను పూర్తి చేశారు.
పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే జరిగిన విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్ధులు బుధవారం కళాశాల ముందు ఆందోళనకు దిగారు. అనూష ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని, కేసు నమోదు చేసుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని విద్యార్ధులకు చెప్పడంతో ఆందోళన విరమించారు.