ఏపీలో కొత్త మండలాలు: నోటిఫికేషన్ జారీ- లిస్ట్ ఇదే
ఏపీలో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ గా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈలోగా స్థానికులు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అవి మనుగడలోకి వస్తాయి. ఇదివరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రక్రియకు కొనసాగింపుగా ప్రభుత్వం దీన్ని చేపట్టింది.
రాష్ట్రంలో ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజించింది ప్రభుత్వం. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

మచిలీపట్నాన్ని సౌత్ మండలం, నార్త్ మండలంగా విభజించింది. రెవెన్యూ, ఇతర పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో మార్పులు చేయలేదు. వాటి పరిధిని పెంచలేదు. రెవెన్యూపరంగా మరింత సుపరిపాలనను అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది.
మచిలీపట్నం విషయంలో మాత్రం కొత్త గ్రామాలను కలుపుకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొంది. వాటిని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది. 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తించింది. ఈ తాజా ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని 30 రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications