గోదావరి వరదలు: ఏపీలోని 6జిల్లాల్లో హైఅలెర్ట్; నీటమునిగిన 135లంక గ్రామాలు, పరిస్థితి ఇలా!!
గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతోంది. గోదావరికి వరద పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో వరద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటి విడుదల 14.76 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇంకా వరద ఉధృతి పెరిగితే, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మరింత తీవ్రమైన ఇబ్బంది నెలకొంటుందని అధికారులు భావిస్తున్నారు.

మళ్ళీ గోదావరి వరదలు.. ఆందోళనలో ప్రజలు
గోదావరి ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ ఇన్ఫ్లోల కారణంగా నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే తాజా పరిస్థితి గోదావరి వరద ఉధృతి కాస్త శాంతించినట్లు కనబడుతోంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ వరద పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు, జూలై నెలలో కురిసిన వర్షాలతో, గోదావరి వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న అనేక గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంకా ఆ బాధలనుండి కోలుకోకముందే మళ్లీ గోదావరి వరదలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గోదావరి వరదలతో ఆరు గోదావరి జిల్లాలలో హై అలెర్ట్
ఇక గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరు జిల్లాల అధికార యంత్రాంగం సిద్ధమైంది. కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరిలోని దాదాపు 135 లంక గ్రామాలు ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. ముంపు బాధిత ప్రాంతాల ప్రజలు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పడవలతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న పోలీసులు, అధికారులు
విఆర్ పురం మండలంలోని శ్రీ రామగిరి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వి.ఆర్.పురం సబ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ నేతృత్వంలోని పోలీసు బృందం పడవలో మూడు గంటలు ప్రయాణించి శ్రీరామగిరి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామం మొత్తం గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. వరద నీరు తగ్గే వరకు గ్రామస్థులు కొండపైకి ఎక్కి టెంట్లు వేసుకుని ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది.రోడ్డు కనెక్టివిటీ తెగిపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర సరుకులు, ఇతర సహాయ సామగ్రిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు అధికారులు.

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కోనసీమలోని పి గన్నవరం, అయినవిల్లి మరియు మామిడికదురు, కూనవరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వి ఆర్ పురంలలో వరద సహాయక బృందాలను రంగంలోకి దించింది. వరదల కారణంగా కోనసీమ ప్రాంతంలో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. గత మూడు రోజులుగా పలు లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
Recommended Video


నీట మునిగిన ఇళ్ళు, పంటపొలాలు .. పరిస్థితి ఇలా
మురమళ్ల, కేసనకుర్రు, పొగకులంక, పల్లెగూడెం, జాంబవానిపేట, ఏదుర్లంకలోని రాఘవేంద్ర వారధిలో పలు ఇళ్లు నీట మునిగాయి. వరదలు వివాహాది వేడుకలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపాయి. ఇదిలా ఉండగా, పొంగి ప్రవహించే వాగులను దాటేందుకు, నీట మునిగిన కాజ్వేలను ఉపయోగించకుండా అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా ఖరీఫ్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం మళ్లీ వరద దెబ్బకు ప్రజలు పీకల్లోతు కష్టాలలో మునిగి పోయారు.












Click it and Unblock the Notifications