గోదావరిపై తెలంగాణకు షాక్- ఏడు ప్రాజెక్టులపై వివరణ కోరిన రివర్ బోర్డు...
గోదావరి నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు హక్కు ఉన్నప్పటికీ అపెక్స్ కౌన్సిల్ తో పాటు జలసంఘం, రివర్ బోర్డు అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కారు ఏడు ప్రాజెక్టులు చేపట్టడంపై గోదావరి బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి అందిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

గోదావరిపై వివరణ కోరిన రివర్ బోర్డు...
గోదావరి నదిపై తెలంగాణ పరిధిలో నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కేసీఆర్ సర్కారుకు లేఖ రాసింది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరంతో పాటు గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తెలంగాణ ఎత్తిపోతల, లోయర్ పెన్ గంగపై మూడు బ్యారేజీలు, రామప్ప చెరువు నుంచి పాకాల చెరువు తరలింపు పథకంపై వివరణ ఇవ్వాలని కోరింది.

ఏపీపై ప్రభావం అంచనా...
తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టుల కారణంగా దిగువ రాష్ట్రమైన ఏపీపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయకుండానే కేసీఆర్ సర్కారు వీటిని చేపడుతోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసినట్లుగోదావరి బోర్డు తమ లేఖలో పేర్కొంది. అలాగే కాళేశ్వరం సామర్ధ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ పథకం సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచారని ఏపీ తమకు ఫిర్యాదు చేసిందని రివర్ బోర్డు తమ లేఖలో తెలిపింది.

ఇప్పటికీ వివరాలు ఇవ్వలేదు...
2019 ఆగస్టులో హైదరాబాద్ లో జరిగిన గోదావరి రివర్ బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కోరినా ఇంత వరకూ ఇవ్వలేదని బోర్డు ఆక్షేపించింది.
ఇప్పటికైనా ప్రాజెక్టు డీపీఆర్ లతో పాటు ఏపీ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సూచించింది.
ఉమ్మడి ఏపీలో 1430 టీఎంసీల మేర గోదావరి జలాల వాడుకునేందుకు అనుమతి ఉందని, విభజన తర్వాత ఏపీకి 776, తెలంగాణకు 650 టీఎంసీల నీరు వాడుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కలిపి 1426 టీఎంసీల మేర ప్రాజెక్టులు చేపట్టాయని, ఇంకా కొత్త ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఈ ఒప్పందాల ఉల్లంఘన జరుగుతోందని ఏపీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications