అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!
అరకు.... ఈ లోక్సభ స్థానంపై ఇప్పుడు దేశం దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అనే అనుమానం చాలా మందికి రావొచ్చు. ఈ సారి లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డు సృష్టించింది గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి. గొడ్డేటి మాధవి వయస్సు 25 ఏళ్లు. ఆమె కమ్యూనిస్టు నేత గొడ్డేటి దేముడు కుమార్తె. ఆయన చింతపల్లి మాజీ ఎమ్మెల్యే.తండ్రి వారసత్వంగా తొలిసారిగా రాజకీయాల్లో వచ్చారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం స్వగ్రామం. తల్లి చెల్లయమ్మ ఎస్జీటీగా పనిచేస్తూ కొయ్యూరు మండలంలోనే నివాసం ఉంటున్నారు.
1992లో మాధవి జన్మించారు. ఆమె అవివాహితురాలు. బీఎస్సీ బీఈడీ చేసిన మాధవి పలు పాఠశాలల్లో పీఈడీ టీచర్గా పనిచేశారు. ఇక గొడ్డేటి మాధవి కొండదొర సామాజిక వర్గానికి చెందినది. తన తండ్రిలానే ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె జీవితంలో జరిగిన ఓ ఘటన తనను రాజకీయాలవైపునకు నడిపించిందని గొడ్డేటి మాధవి చెబుతారు. తాను పనిచేస్తున్న ఓ స్కూలులో ఓ విద్యార్థినికి అస్వస్థత చేస్తే పాడేరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందని అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు చిన్నారికి వైద్యం అందించలేదని చెప్పారు. ఐటీడీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందన్నారు. తన తండ్రిలాగా తాను ఒక ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇక అరకు లోక్సభ నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కిషోర్ చంద్రదేవ్ ఆమె ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనపై 2లక్షల 21వేల ఓట్ల భారీ మెజార్టీతో గొడ్డేటి మాధవి విజయం సాధించారు. కిషోర్ చంద్రదేవ్ రాజకీయ అనుభవం అంత కూడా లేదు గొడ్డేటి మాధవి వయస్సు. అయినప్పటికీ ప్రజలు ఆమెపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించారు. ఇప్పుడు అత్యంత పిన్న వయస్కురాలిగా లోక్సభలో అడుగుపెట్టనున్నారు. అంతకుముందు ఈ రికార్డు దుష్యంత్ చౌతాలా పేరిట ఉండేది. ఆయన 26 ఏళ్ల 13 రోజుల వయస్సున్నప్పుడు లోక్సభలోకి ఎంటర్ అయ్యారు.