ఆ ఒక్కటి సస్పెన్స్!, విజయవాడలో దోపిడీ వెనుక మహారాష్ట్ర గ్యాంగ్(ఫోటోలు)
చోరికి పాల్పడింది బీహార్ ముఠానా? అన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. మహారాష్ట్ర ముఠాయే దోపిడికి పాల్పడిందని పోలీసులు నిర్దారించారు.
విజయవాడ: విజయవాడ నడిబొడ్డున ఉన్న నగల దుకాణంలో చోరీ జరగడం నగరంలోని ఇతర వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడలో ఉన్నవాళ్లకే చాలామందికి ఈ నగల తయారీ కేంద్రం గురించి తెలిసే అవకాశం లేదు. అలాంటి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన దోపిడీ ముఠాకు ఈ విషయం ఎలా తెలిసిందనేది సస్పెన్స్ గా మారింది.
నిజానికి ఈ తయారీ కేంద్రం బయట ఎలాంటి బోర్డు కూడా ఉండదు. ఒక చిన్న సందులో ఉన్న భవనంలోని పై అంస్తులో ఈ తయారీ కేంద్రం ఉందనేది విజయవాడలోను అతికొద్ది మందికే తెలుసు. ఇప్పుడిలా ఇతర రాష్ట్రాల ముఠాల కన్ను కూడా దీనిపై పడిందంటే.. ఇందులో పనిచేసేవాళ్లే సమాచారం అందించి ఉంటారా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
మహారాష్ట్ర ముఠానే:
చోరికి పాల్పడింది బీహార్ ముఠానా? అన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. మహారాష్ట్ర ముఠాయే దోపిడికి పాల్పడిందని పోలీసులు నిర్దారించారు. దోపిడీ తర్వాత నిందితులు ఉపయోగించిన వాహనం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తోనే ఉండటం గమనార్హం.
దోపిడీలో సుమారు 12 మంది యువకులు తుపాకులు, కత్తులు గురిపెట్టి కదిలితే కాల్చి చంపుతామని సిబ్బందిని బెదిరించి బీరువాలోవున్న సుమారు 7 కిలోల బంగారాన్ని తీసుకుని ఉడాయించారు. దీనిపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గుర్ని అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు సైతం దోపిడీ గురించి డీజీపీ సాంబశివరావును ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు.
Recommended Video
వారిపై అనుమానం?:
జైలు నుంచి ఇటీవలే బయటకొచ్చినవారెవరైనా ఈ చోరీకి ప్లాన్ వేసి ఉంటారా? అన్న కోణంలోను పోలీసులు విచారణ సాగుతోంది. దోపిడీ అనంతరం మొత్తం 10 మంది వ్యక్తులు.. ఒకరి తర్వాత ఒకరు షాప్ నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చినట్లు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. గత రెండు నెలలుగా నగల తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడి దృశ్యాలు రికార్డవలేదు.
ఒకరోజే ముందే నగరంలోకి ఎంట్రీ:
దోపిడీ కోసం నగరంలో అడుగుపెట్టిన ఒకరోజంతా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 10వ తేదీ రాత్రి 11.30కు ఈ గ్యాంగ్ ఎంహెచ్ 03 బీసీ 9810 కారులో గుంటూరు వైపు వెళ్లింది. 11వ తేదీ మధ్యాహ్నం 1.30గం.ప్రాంతంలో తిరిగి విజయవాడ చేరుకుంది. దోపిడీ అనంతరం.. రాత్రి 10.25కి మళ్లీ ఈ కారు కాజ టోల్గేట్ దాటింది.
తనిఖీల నుంచి తప్పించుకుని:
చోరీ నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్లు, రహదారుల మార్గంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో గుంటూరు శివారు వై జంక్షన్ వద్ద సోదాలు నిర్వహిస్తుండగా.. అటువైపుగా వచ్చిన నిందితులు, తనిఖీలను గమనించి అక్కడినుంచి పరారయ్యారు. ఆ సమయంలో కారును అక్కడే విడిచి వెళ్లడంతో.. ఈ విషయం స్పష్టమైంది. అందులో పోలీసులకు బుల్లెట్లు, తుపాకీలు, రెండు సెల్ఫోన్లు దొరికాయి. ఆ ఫోన్ల సిమ్ల నుంచి కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు
ఎస్సై వాహనాన్ని ఢీకొట్టి:
తప్పించుకున్న దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే.. అదే రాత్రి గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. విజయవాడ నుంచి గుంటూరులోకి ప్రవేశించిన ముఠా.. నగరంలోని పలు పట్టణాల గుండా చక్కర్లు కొడుతూ.. చివరకు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో చుట్టిగుంట ప్రాంతంలో ఓ ఎస్సై కారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు నిందితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.