బంగారు బల్లి:అంతరించి పోయిందనుకుంటే...తిరుమలలో మళ్లీ అరుదెంచింది
తిరుపతి:తిరుమల గిరుల్లో మాత్రమే దర్శనమిచ్చే అత్యంత అరుదైన బంగారు బల్లి గత ఏడాది నుంచి ఎక్కడా కనిపించకపోవడంతో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఈ చిన్ని ప్రాణాలు అలాగే అంతర్థానమైపోయాయని అందరూ అభిప్రాయానికి వచ్చేశారు.
అయితే ఉన్నట్టుండి ఆదివారం ఈ బంగారు బల్లి మళ్లీ శ్రీవారి భక్తులకు దర్శనమీయడంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనుకాగా...మరోవైపు పరిశోధకులకు ఈ వార్త ఎంతో సంతోషాన్నిచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో...అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద 3150 మెట్టు దగ్గర కొండ మీద ఈ బంగారు బల్లి ఆదివారం రాత్రి కనిపించిందని భక్తులు తెలిపారు.
అరుదైన జీవి...బంగారు బల్లి
గత చాలా నెలల నుంచి ఇవి కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిపై సమగ్ర సర్వేకు పూనుకుంది. అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరిందని సర్వేలు చెబుతున్నాయి. తొలి సర్వేలో తిరుమల గిరుల్లో శేషాచలం అడవులలో బంగారు బల్లులు వున్నాయని, వన్యప్రాణుల సంరక్షణా విభాగం 1987 లో గుర్తించింది. అయితే ఆ తరువాత అటవీ ప్రాంతాల్లో కొండలను తొలచి నిర్మాణాలు చేపడుతుండటంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల గిరుల్లోని చక్రతీర్థం, దీనికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే రుద్రగళ (యుద్ధగళ) తీర్థం ప్రదేశాల్లో మాత్రమే ఈ బంగారు బల్లి కనిపించేది.
జీవన విధానం...వింత అరుపు
ఆంగ్లంలో గోల్డెన్ గేకో లుగా పిలిచే ఈ బంగారు బల్లి శాస్త్రీయనామం కాలొడాక్టి లోడస్ అరీస్. ఇది రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు గాని లేదా లేత పసుపురంగులో గాని ఉంటుంది. ఇవి 150 మి.మీ. నుంచి 180 మి.మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం. అందులోనూ రాతి సందుల్లో తేమ ప్రాంతాలంటే వాటికి మహా ఇష్టం. సాధారణంగా చీకటిపడ్డాక వెలుపలకు వస్తాయి. ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఇళ్లలో ఉన్న సాధారణ బల్లుల కంటే గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం చాలా వింతగానూ ఉంటుంది.
దైవికంగా...భక్తుల విశ్వాసం
తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ రకంగా బంగారు బల్లి గురించి దైవికంగానూ ప్రస్తావన ఉండటం గమనార్హం. కేవలం తిరుమల గిరుల్లోనే ఇవి దర్శనమిస్తుండటం వల్ల కొందరు భక్తులు ఈ బంగారు బల్లులను పవిత్రమైన జీవులుగా అభివర్ణిస్తున్నారు.
మళ్లీ దర్శనం...ఆనందం
ఏడాదికి ముందు చక్రతీర్థంలో ఈ బంగారు బల్లి సజీవంగా కనిపించింది. తాజాగా మోకాళ్ల పర్వతం వద్ద బంగారు బల్లి దర్శనమీయడం విశేషం. ఈ తరహాలోనే మరో రకం బల్లి ఓసారి శ్రీలంకలో కనిపించింది. ఈ రెండు జాతులు ప్రపంచంలో ఈ రెండు చోట్ల తప్పించి మరెక్కడా ఉన్నట్టు ఆధారాలు లేవు. ఏదేమైనా అంతరించిపోయిందనుకున్న బంగారుబల్లి శ్రీవారి కొండల్లో మళ్లీ దర్శనమీయడం అందరినీ ఆనందపరిచింది.