వచ్చేవారం: టిపై షిండే, హైదరాబాద్పై కావూరి హెచ్చరిక
న్యూఢిల్లీ: వచ్చే వారం(27న) మరోసారి భేటీ అవుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం చెప్పారు. కేంద్ర మంత్రుల బృందం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భేటీకి కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, చిదంబరంలు రాలేదని చెప్పారు. ఈ కారణంగా వచ్చే వారం మరోసారి భేటీ అవుతామన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. చిదంబరం అధికారిక విదేశీ పర్యటనలో, ఆజాద్ పార్టీ వ్యవహారాల విషయమై జైపూర్లో ఉన్నందున హాజరు కాలేదు.
అంతకుముందు విభజనపై మంత్రుల బృందం (జివోఎం) గంటన్నర పాటు భేటీ అయింది. నార్త్ బ్లాకులో పదకొండున్నర గంటలకు భేటీ అయిన సమావేశానికి చిదంబరం, గులాం నబీ ఆజాద్ మినహా మిగతా సభ్యులు వచ్చారు. సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, జైరామ్ రమేష్, ఎకె ఆంటోనిలు హాజరయ్యారు. జివోఎం సభ్యులు సిఫార్సులతో కూడిన విభజన ముసాయిదాపై చర్చించారు. పది పేజీల ముసాయిదా నివేదిక పైన చర్చించారు. రేపు జివోఎం మరోసారి భేటీ కానుంది.
కాగా, శుక్రవారం కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పునర్విభజన బిల్లు, జివోఎం నివేదిక పైన చర్చించే అవకాశముంది. వచ్చే వారం జివోఎం మరోసారి భేటీ అనంతరం కేబినెట్ సమావేశంలో విభజన అంశంపై చర్చించనున్నారు. అప్పుడే దానిని ఆమోదించి రాష్ట్రపతికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కావూరి, జెడి హెచ్చరిక
జివోఎం సభ్యులను కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, జెడి శీలంలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు నిలదీసినట్లుగా సమాచారం. తాము విభజనకు అంగీకరించినా తమ డిమాండ్లను పట్టించుకోక పోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే విభజనను అడ్డుకుంటామని, రాజీనామాకు సైతం వెనుకాడేది లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొత్త సవాళ్లు
మరోవైపు డిజిపిల సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ ఏర్పాటుతో భద్రతా దళాలకు కొత్త సవాళ్లు వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ఐజి చీఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం, కేంద్రం మధ్య సయోధ్య అవసరమన్నారు. భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అన్ని వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు.