నిరుద్యోగులకు శుభవార్త: ఏపి సర్కారుకి ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఇందులో ప్రధానంగా.. ఏపీపీఎస్సీ నియామకాలతో పాటు డీఎస్సీ నియామకాలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విభజన ప్రక్రియ నేపథ్యంలో యువత ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కోల్పోవడంతో వారికి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతోనే నిరుద్యోగుల వయో పరిమితిని ఆరేళ్లు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నియామకాల్లో వయో పరిమితిని పెంచడం వల్ల అనేక వేలమందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. నిరుద్యోగ వయోపరిమితి పెంపు 2016, సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపి సర్కారుకి హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆలయ పాలక మండళ్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆలయ ట్రస్ట్ భూములను కాపాడేందుకే ఆర్టినెన్స్ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఏపి ప్రభుత్వ వాదనను హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైంది.