భూ వివాదాలకు చెక్.. ఆ పథకంతో ప్రజల నెత్తిన పాలుపోస్తున్న కేంద్రం!
భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తీసుకువచ్చిన స్వామిత్వ ఆస్తి కార్డుల పంపిణీ కొనసాగుతుంది. చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న స్వామిత్వ ఆస్తికార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వామిత్వ ప్రాపర్టీ కార్డులను ఇస్తున్న కేంద్రం
నిన్న 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్వ ప్రాపర్టీ కార్డులను జారీ చేసిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పేదరికం తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా స్వామిత్వ ఆస్తి కార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశ ప్రజల నెత్తిన అనేక సంక్షేమ పథకాలు, ఉపయుక్త కార్యక్రమాలతో పాలు పోస్తున్నారు.

65 లక్షల మందికి తాజాగా స్వామిత్వ ప్రాపర్టీ కార్డులు
దేశవ్యాప్తంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గడ్ వంటి మొత్తం పది రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, లడక్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలోని 50 వేల గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి నిన్న స్వామిత్వ ఆస్తి కార్డులను అందించారు. మొత్తం 50వేల గ్రామాలకు చెందిన 65లక్షల మందికి ఈ కార్డులను అందజేస్తున్న భారత ప్రధాని లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడారు.
స్వామిత్వ ఆస్తి కార్డులు ఉంటే లాభాలివే
గ్రామీణ ప్రాంతాలలో భూముల డిజిటలైజేషన్ తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇది గ్రామాల సాధికారతకు మార్గాన్ని చూపిస్తుందని ప్రధాన నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్వామిత్వ ఆస్తి కార్డులు ఉన్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు అవుతారని ఆయన అన్నారు.
డ్రోన్ సాంకేతికత తో భూముల సర్వే
భారతదేశంలో మొత్తం ఆరు లక్షల గ్రామాలు ఉంటే వాటిల్లో సగం గ్రామాలలో స్వామిత్వ యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సహాయంతో ఇల్లు మరియు భూములను ఖచ్చితమైన సరిహద్దులతో మ్యాపింగ్ చేసి చట్టబద్ధమైన ఆస్తి కార్డులను భారత ప్రభుత్వం అందజేస్తోంది. ఇక ఈ కార్డులతో వారికి భూముల పైన, ఆస్తులపైన సర్వాధికారాలు వస్తాయి.
ఆస్తులపై చట్ట బద్ధత కల్పించేలా స్వామిత్వ యోజన పథకం
2020లో ప్రారంభించిన ఈ స్వామిత్వ యోజన పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం దాదాపు దేశవ్యాప్తంగా 2.24 కోట్ల మందికి స్వామిత్వ ప్రాపర్టీ కార్డులను అందజేసింది.
పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనదని భావించిన మోదీ సర్కార్ అందుకే ఎవరి ఆస్తులపై వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడానికి ఆస్తి తగాదాలను పరిష్కరించడానికి బ్యాంకు రుణాలు సులభంగా వచ్చేలా చేయడానికి స్వామిత్వ యోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆస్తి కార్డులను అందిస్తోంది.












Click it and Unblock the Notifications