ఆంధ్రా కొబ్బరి రైతు పంట పండిందోచ్: 15 రోజులుగా వెయ్యి కాయ రూ.12 వేలు రికార్డే
కోస్తాంధ్ర కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఆంధ్రా కొబ్బరి కాయలకు డిమాండ్ పెరుగుతోంది.
Recommended Video

అమరావతి: కొబ్బరి రైతుకు పండగల సీజన్ కలిసొచ్చింది. మరో 15 రోజుల్లో దీపావళి పండుగ. ఈ పండుగ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల నిర్వహణలో కొబ్బరి కాయలు కీలకం.
గతంతో పోలిస్తే కేరళలో రబ్బర్ సాగుపై పెరిగిన ఆసక్తి, పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ దిగుబడి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు మంచి రోజులు వచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా వెయ్యి కాయల ధర రూ.12,000 నుంచి రూ 12,500 పలికి రికార్డు సృష్టించింది.
15 రోజులుగా కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఈ స్థాయిలో ధర కొనసాగడం రికార్డని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. 2015లో ఇదే సీజన్లో వెయ్యి కాయల ధర రూ.13 వేలకు కొనుగోలు చేసినా నాలుగైదు రోజులకే పరిమితమైంది. తర్వాత ఒక్కసారిగా రూ.3 వేలు తగ్గింది. ప్రస్తుతం ఉన్న రూ.12 వేలు, రూ.12,500 ధర 15 రోజులుగా కొనసాగుతోంది. వినాయకచవితి నుంచి దీపావళి వరకు సాధారణంగా ప్రతి ఏటా కొబ్బరి మార్కెట్ ఆశా జనకంగానే ఉంటుంది.

ఛత్తీస్గఢ్ నుంచి గుజరాత్ వరకూ ఇలా..
పండుగల సమయంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. చత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొబ్బరి ఎక్కువగా ఎగుమతి అవుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలలోనూ కొబ్బరి తోటలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దిగుబడులు ఎక్కువ. కాయ నాణ్యత, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో కోస్తాంధ్ర కొబ్బరి కాయలకు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రబ్బర్ సాగు లాభదాయకంగా ఉండటంతో కేరళలో మళయాళీల్లో కొబ్బరి సాగుపై ఆసక్తి తగ్గింది. గతం నుంచి కొనసాగుతున్న పాత తోటలే తప్ప కొత్తగా మళయాళీలు నాలుగైదేళ్లుగా నుంచి కొబ్బరి తోటలు వేయడం తగ్గించారు. మరోవైపు తమిళనాడులోనూ దిగుబడి తగ్గిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లోని కొబ్బరికి డిమాండ్ పెరుగుతోంది.

తూర్పుగోదావరిలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి
రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల రైతులు అధికంగా కొబ్బరి సాగు చేస్తున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే లక్ష పది వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. కోనసీమలో అమలాపురంతోపాటు 16 మండలాలు, తుని, తొండంగి, ఏలేశ్వరం, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో కొబ్బరి సాగవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, విశాఖ జిల్లా అడ్డరోడ్డు, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కొబ్బరి సాగవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కొబ్బరి సాగుకు ప్రసిద్ధి. ఈ నాలుగు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు రోజూ 350 లారీల కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి.

రూ.8000 వరకు పలికితే లాభసాటే
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.5000కు పడిపోయింది. వెయ్యి కాయలు చెట్టు నుంచి తీయడానికే రూ.వెయ్యి ఖర్చవుతుంది. తీత కూలీల కొరత కూడా ఉండటంతో అలాంటి సమయాల్లో రైతులు ఇబ్బందులనెదుర్కొంటున్నారు. కనీసం వెయ్యి కాయల ధర రూ.7 వేల నుంచి రూ. 8 వేల మధ్య ధర పలికితే రైతుకు లాభసాటిగా ఉంటుంది. దీపావళి పండుగ వరకు ధర బాగానే ఉంటుందని ఓ కొబ్బరి వ్యాపారి తెలిపారు.

కొబ్బరి ధర పెరిగిందని
గతంలో ఎన్నడూలేని స్థాయిలో కొబ్బరి ధర పెరిగిందని, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొబ్బరి ఎక్కువగా ఎగుమతి అవుతుందన్నారు. కోనసీమ, తేటగుంట, అడ్డరోడ్డు మార్కెట్ల నుంచే రోజూ ఇతర రాష్ట్రాలకు 150 లారీల సరుకు ఎగుమతి అవుతుందని, దీపావళి వరకు ఇదే ధర ఉంటుందని భావిస్తున్నట్లు దొరబాబు అన్నారు.












Click it and Unblock the Notifications