ఏపీ, తమిళనాడుకు శుభవార్త వినిపించిన కేంద్రం
ప్రయాణికులకు శుభవార్త. వారానికి ఐదురోజులు మాత్రమే నడుస్తున్న దిబ్రూగఢ్-కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ ప్రతి రోజు అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివేక్ ఎక్స్ప్రెస్ (22504/22503) ఫ్రీక్వెన్సీని పెంచారు. జులై ఎనిమిదో తేదీ నుంచి 22504 ప్రతిరోజు దిబ్రూగఢ్ నుంచి బయలుదేరనుంది. తిరిగి కన్యాకుమారి-దిబ్రూగఢ్ 22503 జులై 12 నుంచి ప్రతిరోజు కన్యాకుమారి నుంచి బయలుదేరనుంది. భారతదేశంలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలుగా వివేక్ ఎక్స్ ప్రెస్ పేరుగాంచింది.
గమ్యస్థానం చేరాలంటే నాలుగు రోజులు ప్రయాణించాలి
అస్సాంలో దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఇది ప్రయాణిస్తుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 4,218 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రారంభమైన స్టేషన్ నుంచి గమ్యస్థానం చేరుకోవాలంటే ఈ రైలుకు 80 గంటల సమయం పడుతుంది. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి రావాలంటే నాలుగు రోజులు ప్రయాణం చేయాలి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది.

మొత్తం 58 రైల్వేస్టేషన్లలో ఆగే వివేక్ ఎక్స్ ప్రెస్ కు సెకండ్ ఏసీ ఒకటి, థర్డ్ ఏసీ నాలుగు బోగీలు, స్లీపర్ బోగీలు 11, జనరల్ బోగీలు మూడు ఉంటాయి. వీటితోపాటు ప్యాంట్రీకార్ ఉంటుంది. 2011-12 సంవత్సరంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వివేక్ ఎక్స్ ప్రెస్ పై లోక్ సభలో ప్రకటన చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ రైలును ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ తర్వాత దీన్ని పున:ప్రారంభించారు.
సెమీ హైస్పీడ్ రైలు
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను ప్రవేశపెట్టారు. అయితే ఈ రైలులో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వందే సాధారణ్ పేరుతో అన్నీ స్లీపర్ బోగీలతో మరో రైలును తీసుకొచ్చారు. వీటిని దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రధాన నగరాల మధ్య అందుబాటులోకి తెస్తున్నారు.












Click it and Unblock the Notifications